సూర్యాపేట : ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట పట్టణం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కేవలం హుజూర్నగర్కే మంత్రిలా వ్యవహరిస్తున్నారని, జిల్లాలో ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధి హామీని పాత పద్ధతిలోని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో కి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ రాకపోవడంతో గేట్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లేపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, కందాల శంకర్రెడ్డి, మేకనబోయిన శేఖర్, దండ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


