ఇంటి నుంచి ఓటు.. లేనట్లే!
వృద్ధులకు అవకాశం కల్పించాలి
లైన్లో నిలబడలేము
ఫ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటేసిన వృద్ధులు
ఫ పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వని అధికారులు
తిరుమలగిరి (తుంగతుర్తి) : రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటివద్ద నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. నడవలేని, చేతగాని, మంచానికే పరిమితమైన వృద్ధులు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేక పోవడంతో వారు తమ ఓటుహక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఫలితంగా ఓటింగ్శాతం తగ్గుతోంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అటువంటి వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. సర్పంచ్, వార్డు సభ్యులకు ఓటు వేసేందుకు దివ్యాంగులు, వృద్ధులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఎన్నికల సంఘం నుంచి అలాంటి ప్రకటన ఏదీ నేటికీ రాలేదు.
గత ఎన్నికల్లో ఇలా..
గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు జాబితాలో పేరుండి 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 45 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.
ఇందుకు ప్రత్యేకంగా 12–డీ ఫారాన్ని ముందస్తుగానే నింపి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అధికారులు వారు ఇచ్చిన అడ్రస్కు పూర్తిస్థాయి భద్రతతో పోలింగ్ సామాగ్రితో వెళ్లి ఓటు వేయించారు.
ఇబ్బందులు పడే అవకాశం
ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్వాంగులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం లేక పోవడంతో వారు కచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ సమయం కూడా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి
గంట వరకు మాత్రమే ఉంటుంది. నిర్ణీత సమయం లోపు కుటుంబ సభ్యులు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించాల్సి ఉంటుంది. కాదూ అని వారిని వదిలేస్తే ఓటింగ్శాతం తగ్గి గెలుపు, ఓటములపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ఓటర్లు సైతం ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంటి వద్ద నుంచే ఓటు వేసేలా అధికారులు అవకాశం కల్పించాలి. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలాంటి వారిని అధికారులు గుర్తించి అవకాశం కల్పించాలి.
–చెవిటి చంద్రమ్మ, వృద్ధురాలు
పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు మేము పోలింగ్ కేంద్రానికి వెళ్లి గంటల తరబడి అక్కడ నిలబడలేము. అంతదూరం నడుచుకుంటూ వెళ్లాలన్నా ఇబ్బందే. అధికారులు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసుకునేలా అవకాశం కల్పించాలి.
– బాకి అయిలయ్య, వృద్ధుడు.
ఇంటి నుంచి ఓటు.. లేనట్లే!


