ఆరు మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు విడుదల
డ్రెయినేజీలు, అంతర్గత రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పార్కులు, ఓపెన్ జిమ్ల అభివృద్ధి చేస్తారు. అలాగే విలీన గ్రామాల్లో ప్రాధాన్యత క్రమంలో నిధులు ఖర్చు చేయనున్నారు.
సాక్షి, యాదాద్రి: నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీలకు కొంత మేర ఊరట కలిగింది. తెలంగాణ రైజింగ్ విజన్ –2027లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.90 కోట్లు విడుదల చేసింది. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున కేటాయించింది. నిధుల విడుదల పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భువనగిరి మినహా కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపాలిటీలు అనేక సమస్యలు తిష్టవేశాయి. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక మురుగు నీరు వీధుల్లో, నివాసాల మధ్య పారుతోంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. నిధులు రాకతో సమస్యలు కొంతమేర పరిష్కారం అవకాశం ఉంది.
2026 మార్చి నాటికి పనులు పూర్తి
జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో భువనగిరి మినహా మిగతా ఐదు మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డాయి. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి పథకం (యూఐడీఎస్) కింద ప్రభుత్వం రెండు నెలల క్రితమే రూ.90 కోట్లు మంజూరు చేయగా.. శనివారం వాటిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. కలెక్టర్ ఆమోదం కొరకు పంపారు. పరిపాలనా ఆమోదం పొందగానే టెండర్లు పిలువనున్నారు. వెంటనే పనులు ప్రారంభించి 2026 మార్చి నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉంది.
● భువనగిరిలో.. జిల్లా కేంద్రంలో డ్రెయినేజీల నిర్మాణానికి రూ.46.4లక్షలు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీలకు రూ.45లక్షలు, పార్కుల అభివృద్ధికి రూ.4లక్షలు, ప్రధాన రహదారులపై బాక్స్ కల్వర్టుల నిర్మాణానికి రూ. ఒక కోటి, జంక్షన్ల అభివృద్ధికి రూ. 4 కోట్లు ఖర్చు చేయనున్నారు.
● ఆలేరు.. హైస్కూల్ ఆవరణలో ఓపెన్ జిమ్, వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణంతో పాటు ఒక పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థల పరిశీలన చేస్తున్నారు. విలీన గ్రామమైన బహుద్దూర్పేటలో కొన్ని పనులకు నిధులు ఖర్చు చేస్తారు.
● భూదాన్పోచంపల్లి.. సీసీ రోడ్లకు రూ.5 కోట్లు, డ్రెయినేజీలు, పార్కు నిర్మాణం, మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరి సమీపంలో కల్వర్టు నిర్మాణం, మున్సిపల్ కేంద్రంతో పాటు విలీన గ్రామాలైన ముక్తాపూర్, రేవనవల్లిలో శ్మశానవాటికల నిర్మాణానికి రూ.5కోట్లు వెచ్చించనున్నారు. మిగతా నిధులతో మరికొన్ని అభివృద్ధి పనులు చేస్తారు.
● మోత్కూర్.. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణంతో పాటు గతంలో ప్రారంభించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తారు. విలీన గ్రామాలైన కొండగడప, బుజ్జిలాపురంలోనూ పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
● యాదగిరిగుట్ట.. రూ.5 కోట్లతో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మిస్తారు. మిగతా 10 కోట్లు డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. మున్సిపాలిటీలో విలీనం చేసిన పాతగుట్ట, పెద్దిరెడ్టిగూడెంలోనూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఫ ఒక్కో పట్టణానికి రూ.15 కోట్ల
చొప్పున కేటాయింపు
ఫ మౌలిక వసతులకు ప్రాధాన్యం
ఫ కలెక్టర్ ఆమోదం పొందగానే టెండర్లు
ఆరు మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు విడుదల


