గడువు పెంచినా ఆలస్యమే..!
ఆలేరు: ఆలేరు పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) పనులకు మరోమారు బ్రేక్ పడింది. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్లే కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 70 శాతం మేర పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా.. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే మరో ఏడాదైనా పట్టే అవకాశం లేకపోలేదు.
ప్రజల ఇక్కట్లు
● ఆర్యూబీ కోసం చేపట్టిన తవ్వకాలతో వచ్చిన మట్టిని రోడ్డు పక్కనే పోశారు. వాహనాలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో దుమ్ము,ధూళి వస్తుందని స్థానికులు, వ్యాపారులు చెబుతున్నారు.
● ఆర్యూబీకి ఇరుపక్కలా రోడ్డు గుంతలమయంగా మారడంతో వర్షపు నీరు నిలిచినప్పుడు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
● ఆర్యూబీ ఎంట్రీ పాయింట్ నుంచి రైల్వేగేట్ చౌరస్తా వరకు రెండు వైపులా సుమారు 140 మీటర్ల పొడవు అప్రోచ్ రోడ్డు వేయాలి. హైదరాబాద్ నుంచి వరంగల్ మధ్య రోజూ ఆర్టీసీ బస్సులతోపాటు వందల్లో ఇతర వాహనాలు అప్రోచ్ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తుంటాయి. మోకాలు లోతు గుంతలు ఏర్పడటంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది.
● వివేకానంద విగ్రహం వద్ద ఆర్యూబీ లోపల ఎంట్రీ పాయింట్ నుంచి సీసీ రోడ్డు పనులు పెండింగ్లో ఉన్నాయి.
2019లో పనులు ప్రారంభం
ఆర్యూబీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.13 కోట్లు మంజూరు చేసింది. రూ.6 కోట్లు నిర్వాసితులకు, రూ.7కోట్లు సివిల్ పనులకు కేటాయించింది. పనులు 2019లో మొదలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది.
ఎమ్మెల్యే సూచించినా పట్టింపేదీ?
ఆలేరు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆర్యూబీ వద్ద మట్టి రోడ్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. బీటీకి బదులు రెండు వైపులా సీసీ రోడ్లు వేయాలని అధికారులకు సూచించినా నేటికీ అతీగతి లేదు.
ఆర్యూబీ పనులు పూర్తి చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయిస్తామని గతంలో పాలకులు ఇచ్చిన హామీ ఏమైంది. పనుల ఆలస్యంతో స్థానికులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడుతున్నా ఎవరికీ పట్టింపు లేదు. అప్రోచ్ రోడ్లు లేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఆర్యూబీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి.
– కామిటికారి కృష్ణ, బీజేపీ జిల్లా కార్యదర్శి
ఆర్యూబీ పనుల జాప్యంతో విపరీతంగా దుమ్ము వస్తుంది. షాపులో కూర్చోలేకపోతున్నాం. కొనుగోలుదారులు రావడం లేదు. కిరాణం, కొబ్బరి బొండాల వ్యాపారం తగ్గింది. శ్వాసపీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కొందరు చిరువ్యాపారులం మున్సిపల్ అధికారులను కలిసి దుమ్ము రాకుండా నీళ్లు కొట్టాలని విన్నవించాం. అయినా పట్టించుకోవడం లేదు.
– చింతకింది బాలరాములు, వ్యాపారి
ఆలేరులో మళ్లీ నిలిచిన ఆర్యూబీ నిర్మాణం
బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్
ఆరేళ్లుగా ఆగుతూసాగుతున్న పనులు
వాహనదారులు, స్థానికుల అవస్థలు
ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు
సాంకేతిక కారణాల వల్ల పనులు ఆగాయి. తిరిగి ఆర్యూబీ పనులు ప్రారంభించేలా చూస్తాం. కాంట్రాక్టర్కు దాదాపు రూ.4.50 కోట్ల పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు జరిగేలా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ఈ ఏడాది ఆగస్టులో గడువు ముగిసినప్పటికీ అగ్రిమెంట్ను వచ్చే మార్చి వరకు పొడిగించాం.
– కరుణాకర్, ఆర్అండ్బీ ఏఈ
గడువు పెంచినా ఆలస్యమే..!
గడువు పెంచినా ఆలస్యమే..!
గడువు పెంచినా ఆలస్యమే..!
గడువు పెంచినా ఆలస్యమే..!


