
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండల పరిధిలోని అల్లాపురం గ్రామానికి చెందిన గూడూరు బుచ్చిరెడ్డి (59), పక్కీరు అల్వాల్రెడ్డి పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో తాళ్లసింగారం క్రాస్రోడ్డు సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్లో జరుగుతున్న తమ గ్రామస్తుడి వివాహానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈక్రమంలో బాలాజీ దేవాలయం దాటిన తర్వాత వలిగొండ వైపు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న అల్వాల్రెడ్డి, వెనుక కూర్చున్న బుచ్చిరెడ్డి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ట్యాంకర్ బుచ్చిరెడ్డి పైనుంచి వెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. అల్వాల్రెడ్డికి గాయాలుకాగా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
భార్యతో గొడవపడి ఆత్మహత్యాయత్నం
ఫ కాపాడిన పోలీసులు
అర్వపల్లి: మండల పరిధిలోని అడివెంల గ్రామానికి చెందిన రాయపర్తి హరీష్ పది రోజుల కిందట తన భార్య మౌనికతో గొడవపడ్డాడు. ఆమె పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు డబ్బాతో శుక్రవారం గ్రామ శివారులోని గుట్ట ఎక్కి తన బంధువులకు వీడియోకాల్ చేసి చెప్పాడు. దీంతో అతడి బంధువులు, గ్రామస్తులు గుట్ట వద్ద వెతకగా ఆచూకీ దొరకకపోవడంతో 100నంబర్కు డయల్ చేశారు. అర్వపల్లి ఎస్ఐ బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది పసుపులేటి సైదులు, మణికుమార్లు గుట్ట వద్దకు వెళ్లి ఫోన్ లొకేషన్ ఆధారంగా వెతికి హరీష్ను పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకుని బంధువులకు అప్పగించారు. హరీష్ ప్రాణాలు కాపాడిన పోలీసులకు బంధువులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుదాఘాతానికి గురై
ఐదు గేదెలు మృతి
రామన్నపేట: విద్యుదాఘాతానికి గురై ఐదు పాడి గేదెలు మృతి చెందాయి. ఈ సంఘటన శుక్రవారం రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభనాద్రిపురం గ్రామానికి చెందిన జక్కిలి ఐలయ్యకు చెందిన మూడు పాడిగేదెలు, జక్కిలి పద్మ, పోలేపల్లి సత్తయ్యలకు చెందిన ఒక్కో గేదె గ్రామశివారులోని పెసరు అనంతరెడ్డికి చెందిన పొలంలో మేత మేస్తుండగా తెగిపడి ఉన్న విద్యుత్తీగ వాటికి తగిలింది. దీంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. ఒక్కో గేదె విలువ రూ 1.50లక్షల వరకు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం