
పంట వ్యర్థాలు.. భూమికి సారం
త్రిపురారం : పొలాల్లో వరి కోతలు పూర్తయిన తరువాత రైతులు పంట వ్యర్థాలకు రైతులు నిప్పు పెట్టి కాల్చివేస్తున్నారు. దీంతో వాతావరణంలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వానాకాలం, వేసవి కాలంలో వరి కొయ్యలను పొలాల్లోనే కాల్చుతుండడంతో పల్లెల్లో సైతం వాతావరణం కాలుష్యంగా మారుతోంది. పంటలకు సంబంధించిన వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో నేలలో ఉండే పంటలకు మేలు చేసే కీటకాలు, సూక్ష్మజీవులు నశిస్తాయి. రైతులు పంట అవశేషాలను భూమిలో కలియ దున్ని పంటలు సాగు చేస్తే భూసారం పెరిగి పెట్టుబడుల ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి పెరిగి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు.
వ్యర్థాలు భూమిలో
కలియ దున్నడం వల్ల కలిగే లాభాలు
సాధారణంగా పంటల కోతల అనంతరం వ్యర్థాలు పొలాల్లో మిగులుతాయి. వరి కోతల తరువాత గడ్డి, వరి కొయ్యలు, ఇతర పంటల్లో అడుగున ఉండే మొక్కల భాగాలు పొలంలోనే ఉంటాయి. వాటిని కాల్చకుండా భూమిలో కలియదున్నడం వల్ల అవి మట్టిలో కలిసిపోయి సేంద్రియ ఎరువుగా మారి భూసారం మరింత పెరుగుతుంది. నత్రజని, భాస్వరం, సూక్ష్మ పోషకాలు వృద్ధి చెందుతాయి. దీంతో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. రైతులు పొలాల్లో పంటల వ్యర్థాలతో పాటుగా ఇతర వ్యర్థాలు కాల్చడం వల్ల వాతావరణంలోకి కార్బన్ డై ఆకై ్సడ్, మిథేన్, కార్బన్ మోనాకై ్సడ్, విష వాయువులు విడుదలవుతాయి. వ్యర్థాలను భూమిల్లో కలియ దున్నడం వల్ల భూమికి మేలు చేసే కీటకాలు, సూక్ష్మ జీవులను కాపాడుకోవచ్చు. వాన పాములు వృద్ధి చెంది భూమికి మేలు చేస్తాయి.
గడ్డి, కొయ్యలకు ఇలా చేయాలి
● పొలాన్ని రోటవేటర్తో కలియ దున్నాలి. అప్పుడే వరి కొయ్యలు చిన్నచిన్న ముక్కలుగా మారుతాయి.
● దుక్కికి నీళ్లు పెట్టి ఎకరాకు 100 గ్రాముల సింగిల్ సూపర్ పాస్పేట్ వేసి 15 నుంచి 20 రోజులు పొలాన్ని నానబెట్టాలి.
● కొయ్యలు పూర్తిగా కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా మారే విధంగా సమయమివ్వాలి.
భూమి సారవంతంగా ఉండే విధంగా చూసుకోవాలి
పంటల సాగులో దిగుబడులు పెరగాలంటే ప్రతి రైతు నేలను కాపాడుకోవాలి. వ్యర్థాలను కాల్చడం వల్ల భూమికి మేలు చేసే సూక్ష్మ జీవులు నశిస్తాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయి. చీడపీడల ఉధృతి సైతం పెరుగుతుంది. నేల పరిరక్షణతో పాటు వాతావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.
– శ్రీనివాస రావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్,
కృషి విజ్ఞాన కేంద్రం, కంపాసాగర్
కలియ దున్నితే బహుళ ప్రయోజనం

పంట వ్యర్థాలు.. భూమికి సారం