
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం
దేవరకొండ: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం దేవరకొండ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలానికి చెందిన ఈడమోని శ్రీశైలం(44), అదే జిల్లా ఊరుకొండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన ఈరెటి బచ్చయ్య(40) వరుసకు బంధువులు. శ్రీశైలం, బచ్చయ్య వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరు కలిసి పశువులను కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై మంగళవారం మిర్యాలగూడకు వచ్చారు. త్రిపురారం వద్ద వారికి అవసరమైన పశువులను కొనుగోలు చేశారు. రాత్రి కావడంతో అక్కడే బసచేసి బుధవారం ఉదయం స్వగ్రామాలకు బయల్దేరారు. ఉదయం 7గంటల ప్రాంతంలో దేవరకొండ పట్టణంలోని మనోజ్ థియేటర్ సమీపంలోకి రాగానే కొండమల్లేపల్లి నుంచి ఐరన్ లోడ్తో కల్వకుర్తి వైపు వెళ్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీశైలం, బచ్చయ్య తీవ్రంగా గాయపడ్డారు. శ్రీశైలం అక్కడికక్కడే మృతిచెందగా.. బచ్చయ్యను చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దేవరకొండ సీఐ నర్సింహులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు శ్రీశైలం కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన డీసీఎం
● బస్సు క్లీనర్ మృతి
నకిరేకల్: ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణ శివారులోని పద్మానగర్ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మీస్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఛత్తీస్గడ్లోని జగదల్పూర్ నుంచి హైదరాబాద్కు మంగళవారం రాత్రి 8గంటలకు బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామన 5.30గంటల సమీపంలో నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ జంక్షన్ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఇద్దరు ప్రయాణికులను దింపేందుకు డ్రైవర్ బస్సును ఆపాడు. ఛత్తీస్గడ్లోని బిలీసాపూర్కు చెందిన బస్సు క్లీనర్ చరణ్దాస్(36) బస్సు వెనుక డిక్కీలో ఉన్న లగేజీని తీస్తుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్దాస్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో అతడిని నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నార్కట్పల్లిలోని కామినేని వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. బస్సు డ్రైవర్ రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రిష్ణాచారి తెలిపారు. పోస్టమార్టం అనంతరం చరణ్దాస్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఎంజీయూ డిగ్రీ బ్యాక్లాగ్ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో గతంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు చిట్టచివరిగా అవకాశం కల్పించి మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసినట్లు ఎంజీయూ సీఈఓ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.