
ఉన్నత విద్యకు వారు దూరం
భువనగిరి: జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో చదువులకు దూరం కావల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు చెల్లించే పరిస్థితి లేక చదువులకు దూరం కావాల్సి వస్తోంది.
జిల్లాలో రెండే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
జిల్లాలో కేవలం రెండు మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలున్నాయి. వీటిలో రామన్నపేట, ఆలేరు ఉన్నాయి. భువనగిరి పట్టణంలో మాత్రం ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం భువనగిరి.. మున్సిపాలిటీ కేంద్రంగా, శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ఉంది. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రం ఏర్పాటు చేయడంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి ప్రయత్నం చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని, భవనాలు సైతం చూశారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు సైతం తమను గెలిపిస్తే డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీలు ఇచ్చారు. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
పేద విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
ప్రతి ఏటా 1000 మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు తప్ప ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. ప్రైవేట్లో ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు రాక ఫీజు చెల్లించలేని పేద విద్యార్థులు డిగ్రీ చేయలేక ఇబ్బందులు పడుతూ చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా.. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3 నుంచి దోస్త్ తొలి దశ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మూడు విడుతల్లో కొనసాగనుంది.ఈ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాగానే జూన్ 30 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఫ భువనగిరిలో అమలు కాని
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు హామీ
ఫ ప్రారంభమైన డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ
ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం శోచనీయం. పేద విద్యార్థులు గత్యంతరం లేక ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశం పొందుతున్నారు. ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. స్కాలర్ షీప్ రాక ఫీజు చెల్లించలేక చాలా మంది చదువులకు దూరం అవుతున్నారు. ఇప్పటికై న స్పందించి భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి.
– లావుడియా రాజు,
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
పోరాటం కొనసాగిస్తాం
భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో పారాటం చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం కూడా పారాటం చేసేందుకు సిద్ధమవుతున్నాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే వరకు పారాటాన్ని కొనసాగిస్తాం. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
– మణికంఠ, ఏబీవీపీ ఉమ్మడి నల్లగొండ
జిల్లా విభాగ్ కన్వీనర్

ఉన్నత విద్యకు వారు దూరం