
‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం
ఆత్మకూరు(ఎం): రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆత్మకూర్(ఎం) మండలంలోని సర్వేపల్లి, రాయిపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్నట్లయితే రైతులు లిఖితపూర్వకంగా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి జూన్ 2న పరిష్కార పత్రం అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సర్వేపల్లి గ్రామానికి చెందిన కాసరబాద అంజయ్య అనే రైతుతో మాట్లాడారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్న సన్నబియ్యం ఏవిధంగా ఉన్నాయని అడగగా.. బాగున్నాయంటూ బదులిచ్చాడు. సదస్సుల్లో రాయిపల్లిలో 15, సర్వేపల్లిలో 4 దరఖాస్తులు వచ్చాయి. తహసీల్దార్ లావణ్య రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ షఫీయోద్దీన్, ఆర్ఐలు మల్లిఖార్జునరావు, పాండు, సర్వేయర్ స్వప్న, జూనియర్ అసిస్టెంట్లు నవనీత, సంజీవ కంప్యూటర్ ఆపరేటర్ వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు