
ఒకే కంటెయినర్లో 101 పశువుల తరలింపు
● డ్రైవర్పై కేసు నమోదు
కోదాడరూరల్ : కంటెయినర్లో అక్రమంగా తరలిస్తున్న 101 పశువులను ఆదివారం తెల్ల వారుజామున కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని హనుమాన్జంక్షన్ సంత నుంచి హైదరాబాద్లోని కబేళాకు ఒకే కంటెయినర్లో 76 ఎద్దులు, 25 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు. కోదాడ రూరల్ పోలీసులు అంతర్ రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్రోడ్లో కంటెయినర్ను తనిఖీ చేయగా.. పశువులు పట్టుబడ్డాయి. పట్టుబడిన పశువులను గోశాలకు తరలించి డ్రైవర్ ఎర్రవళ్ల సునీల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
గుర్రంపోడు: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం చేపూరు గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేపూరు గ్రామానికి చెందిన నక్కనబోయిన సత్తయ్య(52) ఐదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. దిగుబడి లేక పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురై ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరాన్ని జయప్రదం చేయాలి
భువనగిరిటౌన్ : న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలు) ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరానికి జిల్లాలోని న్యాయవాదులు హాజరై జయప్రదం చేయాలని ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, ప్లీడింగ్ అండ్ డ్రాఫ్టింగ్స్, నూతన చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు.
స్వర్ణగిరీశుడికి
సహస్రనామార్చన సేవ
భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఆదివారం సహస్రనామార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.