
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
భూదాన్పోచంపల్లి : మిస్వరల్డ్ పోటీదారులు ఈనెల 15న భూదాన్పోచంపల్లికి వస్తున్న నేపథ్యంలో అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్, పోచంపల్లి మిస్ వరల్డ్ ప్రోగ్రాం ఇంచార్జ్ డాక్టర్ కె.లక్ష్మి అధికారులకు సూచించారు. శనివారం సాయంత్రం ఆమె తెలంగాణ టూరిజం జీఎం మందాడి ఉపేందర్రెడ్డితో కలిసి భూదాన్పోచంపల్లిలోని టూరిజం పార్కును సందర్శించారు. పార్కులోని గదులు, మ్యూజియం, మగ్గాలు, హాంప్లి థియేటర్, థియేటర్ ప్రాంగణాన్ని పరిశీలించారు. పార్కులో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఏచిన్న సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
బొట్టుపెట్టి, కోలాట బృందాలతో స్వాగతం
25 మంది మిస్ వరల్డ్ కాంటెస్టులు ఈనెల 15న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని మాదాపూర్నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి భూదాన్పోచంపల్లికి రానున్నారని టూరిజం శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్రెడ్డి విలేకరులకు తెలిపారు. రాత్రి 8.30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగంగా కాంటెస్టులకు బొట్టుపెట్టడం, మహిళల కోలాటాలతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో లైవ్ మ్యూజిక్, మెహందీ, మగ్గాల పరిశీలన, దారం నుంచి వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఇంగ్లిష్ వచ్చిన చేనేత మహిళచే ఇక్కత్ డిజైన్ల విశిష్టతను వివరిస్తామని చెప్పారు. అలాగే హాంప్లి థియేటర్ ప్రాంగణంలో సిద్ధిగాంచిన పోచంపల్లి ఇక్కత్తో పాటు సిద్ధిపేట గొల్లభామ, గద్వాల, నారాయణపేట వస్త్రాల ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. టూరిజం పార్కు ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరిస్తామని, ఈ బాధ్యతను హెచ్వర్క్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, సీఐ రాములు, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, ఇంచార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఎస్ఐ భాస్కర్రెడ్డి, ఎంఆర్ఐ గుత్తా వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
ఫ స్పోర్ట్స్ అఽథారిటీ డైరెక్టర్ లక్ష్మి