
భూసార పరీక్షలకు అనువైన సమయమిదే..
2. భూసార పరీక్షల వలన ఉపయోగాలు
● పొలంలో పోషకాల స్థాయి తెలుస్తుంది.
● ఆ పొలంలో ఏయే పంటలు పండించవచ్చో, ఎరువులు ఎంత మోతాదులో, ఎప్పుడు వేయాలో తెలుస్తుంది.
● నేల సమస్యలు తెలుస్తాయి. దాని ప్రకారం ఎరువులను ఉపయోగించవచ్చును.
● ఎరువుల అనవసరపు ఖర్చు తగ్గించవచ్చు.
● సరైన సమయంలో భూసార పరీక్షలు చేయిస్తే సేంద్రియ ఎరువులను కూడా ఉపయోగించి నాణ్యమైన పంటలను పండించవచ్చు.
నడిగూడెం: ప్రస్తుతం రబీ సీజన్ పూర్తయ్యింది. ఈ సమయంలోనే రైతులు తమ పొలాల్లోని మట్టి నమూనాలు తీసి భూసార పరీక్షలు చేయించాలని, వాటి ఫలితాల ఆధారంగా ఎరువులు ఉపయోగించాలని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం మృత్తికా విభాగం శాస్త్రవేత్త ఎ. కిరణ్ చెబుతున్నారు. భూసార పరీక్షలపై ఆయన సలహాలు, సూచనలు..
● పొలం నుంచి సేకరించిన మట్టిని భౌతిక, రసాయన పద్దతుల ద్వారా విశ్లేషించి దాని భౌతిక, రసాయన లక్షణాలు తెలుసుకొని ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుసుకోవడమే భూసార పరీక్ష లక్ష్యం.
● పంట కోత తర్వాత పొలాల్లో నుంచి మట్టి తీయవచ్చు.
● వేసవిలో పంటలు లేని సమయంలో మట్టి నమూనాలు సేకరించవచ్చు.
● ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు మట్టి నమూనాలు తీయరాదు.
● నీరు పెట్టిన తర్వాత, నీడపడే ప్రదేశాలు, నీటి ముంపు ప్రాంతాలు, పెంట కుప్పల దగ్గర, గట్లు, చెట్లు, రోడ్ల దగ్గర తీయరాదు.
● ఒక రకం పొలానికి ఒక నమూనా తీయాలి. పొలం మరీ పెద్దయితే ప్రతి ఐదెకరాలకు ఒక నమూనా తీయాలి.
● నేల నిర్మాణం, రంగు, మురుగు, నీటి పారుదల సౌకర్యం, నేల వాలు, చౌడు, క్షార, గుణాలు, పంటల సరళి మొదలగు విషయాల్లో ఏదైనా తేడా కన్పిస్తే అన్ని నమూనాలు ఆ పొలం నుంచి తీయాల్సి ఉంటుంది.
● పైరు పంటలకు భూమిలో 6 అంగుళాలు లోతులో మట్టి నమూనాలు సేకరించాలి.
● పండ్ల తోటల్లో 5 నుంచి 6 అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమూనా తీయాలి.
● కారి, చౌడు, ఆమ్ల నేలల్లో అడుగు లోతులో ప్రతి 6 అంగుళాలకు ఒక నమూనా తీయాలి.
● నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు మొదలగు వాటిని తీసివేసి మట్టి నమూనాలు సేకరించాలి.
● గడ్డపార లేదా పారతో గొయ్యి తీసి దాని అంచుల నుంచి పారతో లేదా తాపీతో మట్టిని సేకరించాలి.
● పొలంలో 8 నుంచి 10 స్థలాల నుంచి మట్టిని తీయాలి.
● సేకరించిన మట్టినంతటిని కలిపి నేలపై పరచి దానిని 4 భాగాలు చేయాలి.
● మూలలకు ఎదురెదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని పారవేయాలి.
● ఈ విధంగా 500 గ్రాముల మట్టి నమూనాలను సేకరించాలి.
● ఈ అరకేజీ మట్టిని గుడ్డ సంచిలో లేదా పాలిథిన్ సంచిలో వేసి, రైతు పేరు, చిరునామానా, సర్వే నంబర్, పొలం విస్తీర్ణం, మెట్ట, పల్లం, ఆరుతడి పంటలు, గత 3 సంవత్సరాలుగా వాడుతున్న ఎరువులు, రాబోయే సీజన్లో వేయాల్సిన పంటలు, సేకరించిన తేదీ మొదలగు వివరాలను జతచేయాలి.
● ఈ సమాచారంతో కూడిన మట్టి నమూనాలను సంబంధిత వ్యవసాయ అధికారులకు లేదా భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. లేదా గడ్డిపల్లి కేవీకేకు పంపించినా పరీక్షలు చేసి, సాయిల్ హెల్త్కార్డు పంపిణీ చేస్తారు.
గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం
శాస్త్రవేత్త కిరణ్ సూచనలు

భూసార పరీక్షలకు అనువైన సమయమిదే..