
ప్రారంభంలో జాప్యం!
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించేందుకు విశాలమైన ప్రదేశంలో గత ప్రభుత్వ హయాంలో అన్నదాన ప్రసాద కేంద్రం పనులు చేపట్టారు. ఈ పనులకు 2021 మార్చిలో శంకుస్థాపన చేయగా.. ఈ ఏడాది మార్చి 23వ తేదీన పూర్తి చేశారు. సుమారు 4 సంవత్సరాల పాటు పనులు కొనసాగాయి. గత నెల 23వ తేదీన పనులు పూర్తి అయినప్పటికీ భవనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు మాత్రం చేయడం లేదు. ప్రభుత్వంతో పాటు భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలు సమయం ఇవ్వకపోవడంతో ప్రారంభోత్సవం ఆలస్యం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలు, దాతలు సమయం ఇస్తే వచ్చే నెల శ్రీస్వామి వారి జయంతి ఉత్సవాల నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తామని చెబుతున్నారు.
భవన నిర్మాణానికి 2.7 ఎకరాల స్థలం..
అన్నదాన భవన నిర్మాణానికి వైటీడీఏ 2.7ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 1.3ఎకరాల్లో అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఈ అన్నదాన భవనంలో రెండు డైనింగ్ హాల్స్, రెండు వెయిటింగ్ హాల్స్, 12 స్టోర్ రూమ్లు నిర్మించారు. ఒకేసారి ఒక్కో హాల్లో 500మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు అవకాశం ఉంది. భక్తుల కోసం బయట గార్డెన్ సైతం ఏర్పాటు చేశారు. భక్తులు కూర్చొని తినేందుకు కుర్చీలు, టేబుల్స్ను సైతం సిద్ధం చేశారు. ఇక భవనం ఆవరణలో జల ప్రసాదాన్ని నూతనంగా సిద్ధం చేశారు. భవన నిర్మాణానికి వెగెశ్న ఫౌండేషన్ మొదటగా రూ.11కోట్లు అందజేసింది. ఆ తరువాత వైటీడీఏ సుమారు రూ.11కోట్ల వరకు ఖర్చు చేసింది. కాగా గతేడాది క్రితంగా మిగిలిన పలు పనుల కోసం తిరిగి వెగెశ్న సంస్థ మరో రూ.2కోట్లు ఖర్చు చేసి, పూర్తి చేసింది. మొదట్లో ఈ భవన నిర్మాణం ఆలస్యం కావడంతో రెండేళ్ల క్రితం అప్పటి ఈఓ గీతారెడ్డి పనులు పూర్తికాక ముందే హడాహుడిగా గత ప్రభుత్వ పెద్దలతో ప్రారంభోత్సవం చేయించారు. కానీ పనులు పూర్తి కాకపోవడంతో భక్తులను నూతన భవనంలోకి అనుమతించలేదు. ప్రస్తుతం గండి చెరువు పక్కన ఉన్న లక్ష్మీ పుష్కరిణి చెంత గత దీక్షాపరుల మండపంలోనే భక్తులకు అన్న ప్రసాదం అందజేస్తున్నారు.
ఫ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని అన్నప్రసాద కేంద్రం భవనం పనులు పూర్తి
ఫ ప్రభుత్వ పెద్దలు, దాతల సమయం కోసం వేచి చూస్తున్న ఆలయాధికారులు

ప్రారంభంలో జాప్యం!

ప్రారంభంలో జాప్యం!