
సత్తా చాటిన సర్కారు బడులు
భువనగిరి: ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల కంటే అధిక ఉత్తీర్ణత శాతంతో పాటు అత్యధిక మార్కులు సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 25వ స్థానంలో ఉండగా 2024–25 సంవత్సరానికి 7వ స్థానానికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా గత మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 8,631 మంది విద్యార్థులు హాజరు కాగా 8,432 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేవలం 199 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఇందులో 163 ప్రభుత్వ పాఠశాలలుండగా 4453 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 4,298 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా కేజీబీవీ, టీఎస్ఆర్ఐఎస్, ఎస్టీ ఆశ్రమ పాఠశాలలు 15 ఉండగా ఆయా పాఠశాలలకు చెందిన మొత్తం 713 మంది హాజరుకాగా 696 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, మైనార్టీ, వెల్ఫేర్ 14 పాఠశాలలుండగా ఈ పాఠశాలకు చెందిన మొత్తం 908 మందికి గాను 906 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా జిల్లాలోని మూడు మోడల్ స్కూళ్లు, 5 కేజీబీవీలు, 81 జెడ్పీ పాఠశాలలు, నాలుగు బీసీ వెల్ఫేర్, మూడు మైనార్టీ గురుకులాలు, ఐదు సోషల్ వెల్ఫేర్, ఒక ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆయా పాఠశాలల్లో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 677 మంది ఉన్నారు. కాగా.. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
అత్యధిక మార్కులు సాధించింది వీరే..
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించారు. భువనగిరిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మాదురియ(521), గూడూరు జెడ్పీహెచ్ఎస్కు చెందిన శ్రీహిత(572), మల్యాలలోని మోడల్ పాఠశాలకు చెందిన ఉద్భవ్సాయి (562), కేజీబీవీ వలిగొండకు చెందిన శ్రావణి (532), భువనగిరి మండలం అనంతారం గ్రామపరిధిలోని బీసీ గురుకుల పాఠశాలకు చెందిన రమేష్ (587), చౌటుప్పల్ రెస్సిడెన్షియర్ పాఠశాలకు చెందిన కీర్తిక (567), ఆలేరులోని మైనార్టీ పాఠశాలకు చెందిన ప్రసన్న(562), చౌటుప్పల్లోని సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన లాస్యప్రియ (572), బీబీనగర్ బీసీ గురుకుల పాఠశాలకు చెందిన సాయి మేఘన (582), భువనగిరిలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలకు చెందిన ప్రత్యూష (501) ఉన్నారు.
టెన్త్ ఫలితాల్లో ప్రైవేట్కు దీటుగా
రాణించిన ప్రభుత్వ పాఠశాలలు
500పైగా మార్కులు సాధించిన
677 మంది విద్యార్థులు
అత్యధిక మార్కులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థికే..
జిల్లాలో అత్యధిక మార్కులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే సాధించారు. ఇందులో భువనగిరి మండల పరిధిలోని అనంతారం గ్రామ పరిధిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన రమేష్ అనే విద్యార్థి 587 మార్కులు సాధించాడు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సైతం ఇన్ని మార్కులు రాకపోవడం గమనార్హం.

సత్తా చాటిన సర్కారు బడులు