రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

Apr 28 2025 1:39 AM | Updated on Apr 28 2025 1:39 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

మునగాల: లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మునగాల శివారులో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పొన్నగండ్ల జ్యోతి(49) మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లింది. తిరిగి శనివారం రాత్రి తన అల్లుడు గాదె నరేందర్‌రెడ్డి కారులో స్వగ్రామానికి బయల్దేరింది. మార్గమధ్యలో అర్ధరాత్రి సమయంలో మునగాల శివారులోని కెనరా బ్యాంకు ఎదురుగా రోడ్డు పక్కన ధాన్యం లోడుతో ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొట్టింది. కారు ముందు సీటులో కూర్చున్న జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల పోలీస్‌ స్టేషన్‌ హౌజ్‌ అధికారి వెంకటరత్నం తెలిపారు.

భార్యతో గొడవపడి

భర్త ఆత్మహత్య

అర్వపల్లి: మద్యానికి బానిసైన వ్యక్తి భార్యతో గొడవపడి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి జరిగింది. అర్వపల్లి ఎస్‌ఐ సీహెచ్‌. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన నవ్య, సూర్యాపేట మండలం గాంధీనగర్‌కు చెందిన జక్కలి జనార్దన్‌(30) తొమ్మిదేళ్ల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. జనార్దన్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన జనార్దన్‌ తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు. నవ్య ఉగాది పండుగకు తన పిల్లలతో కలిసి తల్లిగారి ఊరైన కొమ్మాలకు వచ్చింది. అప్పటి నుంచి తల్లిగారి ఇంటి వద్దే ఉంటోంది. మూడు రోజుల కిందట జనార్దన్‌ కూడా అత్తగారింటికి వచ్చాడు. ఈ క్రమంలో మద్యం తాగుతూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటాక జనార్దన్‌ తన అత్తగారి ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రెండు కార్లు ఢీ..

ఒకరికి గాయాలు

అర్వపల్లి: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై అర్వపల్లిలో ఆదివారం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ వైపు నుంచి రెండు కార్లు సూర్యాపేట వైపు వెళ్తున్నాయి. అర్వపల్లిలోని వైజంక్షన్‌ వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ముందు వెళ్తున్న కారు వైజంక్షన్‌ వద్ద ఓ టీస్టాల్‌ బోర్డుకు తగిలి తోపుడుబండ్ల పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడే నిలిపి ఉన్న కర్కాని రమేష్‌కు చెందిన బైక్‌ ధ్వంసమైంది. తోపుడు బండ్ల వద్ద ఉన్న మహిళలు సావిత్రి, సువర్ణ అక్కడి నుంచి పరుగు తీసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు కార్లను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ముందు కారు నడుపుతున్న ఆరోగ్యరెడ్డి గాయపడగా.. అతడిని 108 అంబులెన్స్‌లో సూర్యాపేట జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
1
1/1

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement