ఆత్మకూర్(ఎస్): బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదని నిరసిస్తూ శుక్రవారం ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామంలో భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు బండరాళ్లను నెత్తిన పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారని, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ఇస్తామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదన్నారు. నిరసన కార్యక్రమంలో గోగుల శేఖర్రెడ్డి, గుడిపల్లి సుమతి, తలారి సహదేవుడు, ఆకారపు వెంకన్న, వంటెపాక ముత్తయ్య, ఆరూరి బాబు, మేకల వెంకన్న, గుమ్మడవెల్లి ఆంజనేయులు, లింగయ్య, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.