నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని, బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్దపీట వేయగా అందులో నల్లగొండ జిల్లానే ముందుందన్నారు. గతంలో ధాన్యం దిగుమతిలో నల్లగొండ జిల్లా ముందుందని.. ఈసారి ఆయకట్టు సాగు పెరిగిందని, దీని ద్వారా దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. బ్రాహ్మణవెల్లెంలకు బడ్జెట్లో కేటాయింపులు రెండింతలు పెంచారన్నారు. కాల్వ పనులు పూర్తిచేసేందుకు రూ.37 కోట్లు విడుదల చేశామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను సంతోషంగా ప్రారంభించామని, కానీ అనుకోని ప్రమాదం జరిగి 8 మంది చనిపోవడం బాధాకరమన్నారు. అయినప్పటికి ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని వాటికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బడ్జెట్లో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాల విద్యకు బడ్జెట్లో రూ.11వేల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందించనున్నట్లు పేర్కొన్నారు. వృత్తి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నల్లగొండలో రూ.75 కోట్లతో నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ) ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.
12వేల కి.మీ. మేర రోడ్ల నిర్మాణం..
ఆర్అండ్బీ శాఖ నుంచి రూ.5099కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 12వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి వచ్చే నెల టెండర్లు పిలువబోతున్నామని మంత్రి తెలిపారు. నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మిస్తున్నామన్నారు. రైతులకు రూ.2400 కోట్లు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని, తాము ఆ ప్రభుత్వం కట్టిన ఇళ్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు మరో 3500 ఇల్లు మంజూరు చేశామన్నారు. వేసవిలో శ్కా ఎకరం కూడా ఎండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు.
ఫ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు
బడ్జెట్లో అధిక కేటాయింపులు
ఫ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తిచేస్తాం
ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి