భువనగిరిటౌన్ : వ్యాపారులు తప్పనిసరిగా ఆహారభద్రత నియమాలు పాటించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. తూకాలు, నాణ్యత విషయంలో కొనుగోలుదారులను వ్యాపారులు మోసం చేస్తున్న తీరుపై ‘కొనేదాంట్లో–– కొట్టేస్తున్నారు’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాల్లో ఆహార భద్రతా నియమాలు అమలయ్యే చర్యలు తీసుకోవాలని సూచించారు. హోటళ్లు, బేకరీలు, స్వీట్ హౌజ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లతో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే భోజనం విషయంలో నాణ్యత ఉండాలని, అందుకోసం తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. లైసెన్స్ పొందిన పొందిన ఆహార పదార్థాలనే ప్రజలకు విక్రయించేలా చూడాలన్నారు.
ఫుడ్ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు
అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్ఓ మనోహర్, జిల్లా అధికారులతో కలిసి జిల్లాస్థాయి ఫుడ్ సేఫ్టీ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, డాక్టర్ సుమన్ కళ్యాణ్, బీసీ వెల్ఫేర్ అధికారి యాదయ్య, వ్యవసాయ అధికారి గోపాల్, డిప్యూటీ సివిల్ సప్లై అధికారులు రోజా రాణి తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి