భువనగిరి టౌన్ : జిల్లాలో ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎండీ సిరాజుద్దీన్ను జిల్లా సరఫరాల శాఖ డీటీగా నియమించి భువనగిరి ఆర్డీఓ కార్యాలయానికి డిప్యూటేషన్పై పంపారు. పున్న శివకుమార్ను కలెక్టరేట్లో, దున్న లింగస్వామిని బొమ్మలరామారం, ఎం.ఉపేందర్ మోత్కూరు, జనగాం శైలజను రామన్నపేట డీటీలుగా బదిలీ చేశారు. అదే విధంగా ఉయ్యాల కవితను ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (లోకల్బాడీలో) యూనిట్ 2కు, శివగణేష్ను ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్(లోకల్బాడీ) యూనిట్ 1కు కేటాయించారు.
పీఓడబ్ల్యూ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
ఆలేరు రూరల్: ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జిల్లా నూతన కమిటీని బుధవారం ఆలేరులోని సీపీఐఎంఎల్ ఎన్డీఆర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా పంగ వరలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా కొత్తపేట విజయ, కార్యదర్శిగా కోలా అనిత, సహాయ కార్యదర్శి పంగ సరిత, కోశాధికారిగా వస్పరి స్వరూప, కార్యవర్గ సభ్యులుగా గట్టికొప్పుల అంజమ్మ, మడూరి లక్ష్మి, జన్నె లక్ష్మిని ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర కన్వీనర్ పంగ వరలక్ష్మి, రాష్ట్ర నాయకురాలు జంగిటి సుభాషిణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పి.జయ, ఆర్.బాలమ్మ, పద్మ, కె.జ్యోతి, స్రవంతి, అనూసూర్య, భాగ్య పాల్గొన్నారు.
మోత్కూరు తహసీల్దార్పై కలెక్టర్కు ఫిర్యాదు
భువనగిరి, మోత్కూర్: తమ భూములను అక్రమంగా ఇతరులకు పట్టా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మోత్కూరు తహసీల్దార్ రాంప్రసాద్పై పలువురు రైతులు బుధవారం కలెక్టర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు. 15 మంది రైతులు మోత్కూరు పట్టణంలో 38 గుంటల భూమి కొనుగోలు చేశారు. పక్కనే ఉన్న మరో వ్యక్తి భూమికి సంబంధించి కూడా అదే సర్వే నంబర్ కావడంతో కొంతకాలంగా వివాదం నెలకొంది. కాగా డబ్బులు ఆశించి 38 గంటలు సదరు వ్యక్తికి పట్టా చేసే ప్రయత్నం చేస్తున్నారని, తహసీల్దార్ తమకు నోటీసులు కూడా జారీ చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రక్రియ నిలిపివేయాలంటూ తహసీల్దార్ను ఆదేశించారు. అంతకుముందు బాధితులు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సుధగాని ముత్యాలు, అవిశెట్టి బాలరాములు, లొడంగి లక్ష్మి, పెండం భారతమ్మ, జోగు రామచంద్రయ్య, దునక ప్రభాకర్, హాజారి చంద్రరావు, ముక్కలమల అంజమ్మ, కాపుగంటి ధనలక్ష్మి, కొండయ్య, అవిలిమల్లు పాల్గొన్నారు.
నేడు సూర్యాపేటకు కేటీఆర్ రాక
సూర్యాపేట టౌన్: వరంగల్లో ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ బహిరంగ సభ విజయవంతానికై గురువారం సూర్యాపేటలో ఆ పార్టీ జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బహిరంగ సభ విజయవంతంతోపాటు జిల్లాలో సాగు, తాగునీటి సమస్యపై చర్చించనున్నట్టు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య నేతలంతా విధిగా హాజరు కావాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో చేనేత కార్మికులకు ఇవ్వనున్న అవార్డులకు అర్హత కలిగినవారు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేతజౌళి శాఖ ఏడీ ద్వారక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత డిజైన్ వృత్తిలో పనిచేస్తున్న వారికి అవార్డు ఇస్తారని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేస్తారని తెలిపారు.
ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్