గరిడేపల్లి: పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన వ్యవసాయ కూలీ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పొనుగోడు గ్రామానికి చెందిన నేలపట్ల సైదులు(32) బుధవారం తాను జీతం ఉంటున్న కటకం గోపయ్య పొలం వద్ద వరి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. అక్కడ తెగి పడి ఉన్న ఎల్టీ లైన్ చూసుకోకపోవడంతో వైరు కాళ్లకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అన్న గురుమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చలిగంటి నరేష్ తెలిపారు.
గోడ దూకుతుండగా..
మిర్యాలగూడ టౌన్: చెట్టు కొమ్మ పట్టుకొని గోడ దూకుతుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారు జంకుతండా సమీపంలోని ఇండస్ట్రీయల్ ఏరియాకు చెందిన చింతపల్లి పవన్కళ్యాణ్(19) బుధవారం తన మిత్రుడు పూజ దుర్గాతో కలిసి ఇండస్ట్రీల్ ఏరియాలోని ఆర్ఎస్ గోదాంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వారిద్దరు చెట్టు కొమ్మ పట్టుకొని గోడ దూకే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్కు చెట్టు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో పవన్కళ్యాణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన దుర్గా పరిస్థితి విషమంగా ఉండటంతో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.