నూతనకల్: నూతనకల్ మండలం మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యగౌడ్ హత్యకు కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మిర్యాల గ్రామాన్ని సందర్శించి మృతుడి భార్య జయమ్మ, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న వారిపై దర్యాప్తు చేసి శిక్ష పడేలా చూస్తామన్నారు. అదే గ్రామానికి చెందిన కనకటి వెంకన్న భూమి క్రయవిక్రయాల సమయంలో కల్గించే ఇబ్బందులను కూడా బాధితులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కనకటి వెంకన్న అగాయిత్యాలకు సహకరించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్నారు. దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై కొంత మంది పోలీసు అధికారులకు మెమోలు జారీ చేశామని తెలియజేశారు. గ్రామస్తులు శాంతియుతంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని కోరారు. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రధానంగా అల్లుళ్లు కనకటి వెంకన్న, కనకటి ఉప్పలయ్య, కనకటి లింగయ్య ఉన్నారని, వీరికి సహకరించిన మరో 16మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 9మందిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆయన వెంట సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రవి, సీఐ శ్రీనివాస్నాయక్, నాగభూషణం, రఘువీర్, ఎస్ఐ మహేంద్రనాథ్ ఉన్నారు.
ఫ మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ
ఫ హత్యకు గురైన చక్రయ్యగౌడ్ కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ