చిట్యాల: చెప్పిన చోట బస్సు ఆపలేదని ప్రయాణికుడు ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేశాడు. ఈ ఘటన చిట్యాలలో బుధవారం రాత్రి జరిగింది. నల్లగొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు భువనగిరి నుంచి నల్లగొండకు వెళ్తోంది. ఇద్దరు ప్రయాణికులు చిట్యాలకు వెళ్లేందుకు గాను రామన్నపేటలో బస్సు ఎక్కారు. వారు రామన్నపేట–చిట్యాల మధ్యలో బస్సు నిలపాలని డ్రైవర్ను కోరారు. చిట్యాలకు వెళ్లేందుకు ఎక్కిన ప్రయాణికులు మధ్యలో బస్సు ఆపమనడంతో డ్రైవర్ శ్రీనివాస్ బస్సు ఆపలేదు. దీంతో బస్సు చిట్యాలకు వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ప్రయాణికులు డ్రైవర్పై దాడి చేశారు. డ్రైవర్ శ్రీనివాస్ చిట్యాల పోలీస్ స్టేషన్ వద్ద బస్సు నిలిపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం నిలిపివేసిన బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపివేశారు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి ఆత్మహత్య
మిర్యాలగూడ అర్బన్: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. బుధవారం మిర్యాలగూడ టూటౌన్ సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో నివాసముంటున్న ముడావత్ నాగు(35)కు, అతడి భార్య ప్రియ మధ్య మనస్పర్ధలు రావడంతో కొద్దిరోజులుగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 9:30 గంటల సమయంలో ప్రియ తన కుమార్తెను ట్యూషన్ నుంచి తీసుకురావడానికి వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న నాగు లోపలి నుంచి గడియ పెట్టుకుని చీరతో ఉరేసుకున్నాడు. ట్యూషన్ నుంచి కుమార్తెను తీసుకుని ఇంటికి వచ్చిన ప్రియ నాగు ఉరికి వేలాడుతుండటం గమనించి ఇంటి పక్కన వారిని పిలిచి తలుపులు పగులకొట్టి అంబులెన్స్లో మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే నాగు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న నాగు తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చి తమ కుమారుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కోడలు ప్రియ, ఆమె అక్క విజయ, బావ సైదాపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి పంతులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జున తెలిపారు.
జామాయిల్ తోట దగ్ధం
రాజాపేట: మండలంలోని బొందుగుల గ్రామంలో బుధవారం రైతు బొందుగుల వెంకట్రెడ్డికి చెందిన జామాయిల్ తోట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. చుట్టుపక్కల రైతులు గమనించి అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. 40 ఎకరాల జామాయిల్ తోటలో సుమారు 30 ఎకరాలు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు.
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని బుధవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఎదుర్కోళ్ల మహోత్సవం అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ తలంబ్రాలు వైభవంగా జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.