పాల దిగుబడి ఎక్కువే
పశుగ్రాసాల సాగుకు తక్కువ శ్రమ, పెట్టుబడి అవసరం అవుతుంది. విత్తనాలు నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకు వస్తుంది. పచ్చి మేత రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి. సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చి మేత వలన పాల దిగుబడులు 25శాతం వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. దాణా అవసరం లేకుండా కేవలం పచ్చి మేత ద్వారా 5 నుంచి 6 లీటర్ల పాల దిగుబడి సాధించవచ్చు. పచ్చి మేతలో కాల్షియం, భాస్వరం వంటి మాంసకృత్తులతో పాటు ఏ, డీ, ఈ విటమిన్లు, పిండి, కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి. నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు.
పెద్దవూర: పశుగ్రాసం అంటే రైతులకు గుర్తుకొచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటికి ఖర్చు అధికం. శాసీ్త్రయ పద్ధతిలో నాణ్యమైన పశుగ్రాసం అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక పాల ఉత్పత్తి సాధించవచ్చు. పశుగ్రాసం సాగు ఖర్చు తగ్గించవచ్చు. డెయిరీ ఫాంల నిర్వహణ వ్యయంలో 70శాతం వరకు పశువుల మేతకే సరిపోతుంది. అందువల్ల మేత ఖర్చును తగ్గిస్తే అంతమేరకు లాభాలు పెంచుకునే అవకాశం ఉంది. అలాగే పాలశీతలీకరణ అధికారులు పాలు సప్లయ్ చేసే రైతులకు 50 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు అందిస్తారు. పశుసంవర్థక అధికారులు సైతం 50శాతం రాయితీపై విత్తనాలు ఇవ్వనున్నారు. పశువుల కాపరులు వీటిని సద్వినియోగం చేసుకుని పశుగ్రాసం సాగు చేస్తే గడ్డి కొరత తీరుతుందని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్ నులక నాగార్జున్రెడ్డి సూచించారు.
పశుగ్రాసం సాగు విధానం
● పశుగ్రాసం విత్తనాల్లో ప్రధానమైనవి సూపర్ నైపర్, కో–1, కో–2, ఎస్ఎస్జీ–825 రకాలు.
● 85శాతం వరకు పచ్చిమేతను ఈ రకాల ద్వారా తీర్చుకోవచ్చు.
● ఒకసారి నాటితే నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు దిగుబడులు పొందవచ్చు.
● జనవరి నుంచి ఆగస్టు నెల వరకు ఈ పశుగ్రాసం విత్తనాలు విత్తుకోవచ్చు.
● అన్నిరకాల నేలల్లో సాగు చేసుకోవచ్చును. ఆమ్ల గుణాలు గల నేలల్లో అధిక దిగుబడి ఉంటుంది.
● పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు తోటలు, కూరగాయ పంటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
● ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం. మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు.
● దుక్కిలో 4 నుంచి 5 టన్నుల కంపోస్టు ఎరువు, 22 కిలోల యూరియా, 16 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.
● విత్తిన 45 రోజుల తర్వాత ఎకరాకు 22 కిలోల యూరియా వేయాలి. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది.
● అధిక విస్తీర్ణంలో సాగుచేసి సైలే జీ లేదా ఎండుగడ్డి రూపంలో నిల్వ చేసి వాడుకోవచ్చు.
శాసీ్త్రయ పద్ధతుల్లో పశుగ్రాసం సాగు భేష్