మేళ్లచెరువు: బైక్పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి రోడ్డు పక్కకు రాగా లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం మేళ్లచెరువు మండల కేంద్రంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన పెద్దారపు అంజి(27) పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం అంజి సోమవారం బైక్పై మేళ్లచెరువు మండలకేంద్రానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మేళ్లచెరువు మండల కేంద్రంలోని హోండా షోరూం సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కకు రాగా.. మేళ్లచెరువు నుంచి కోదాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అంజి రోడ్డుపై పడిపోగా అతడి పైనుంచి లారీ వెళ్లడంతో తల పలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ మైహోం పరిశ్రమకు చెందినది కావడంతో మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని మైహోం పరిశ్రమ గేటు ఎదుట సోమవారం రాత్రి వరకు నిరసన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వలస కూలీకి తీవ్ర గాయాలు..
చౌటుప్పల్ రూరల్: రోడ్డు దాటుతున్న వలస కూలీని లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని దంతెవాడకు చెందిన చన్నం సురేష్(19) చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని ఓ పరిశ్రమలో కూలీగా పని చేయడానికి రెండు వారాల క్రితం వచ్చాడు. పరిశ్రమలో కూలీ పని లేకపోవడంతో తిరిగి ఛత్తీస్గడ్ రాష్ట్రానికి వెళ్లడానికి ఆదివారం రాత్రి దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి దాటుతుండగా.. విజయవాడ వైపు వెళ్తున్న లారీ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా యాదవరెడ్డి తెలిపారు.