కనగల్: మండలంలోని బుడుమర్లపల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతిచెందాడు. కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన ప్రకారం.. కనగల్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన కడారి వెంకటేశం(45) ఆ గ్రామ మాజీ సర్పంచ్ పగిళ్ల యాదయ్య వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం గ్రామ వాగులో ఇసుకను లోడ్ చేసుకొని నల్లగొండకు తరలిస్తుండగా.. మార్గమధ్యలో బుడుమర్లపల్లి వద్ద ట్రాక్టర్ ట్రాలీ డోరు కొండి ఊడింది. ఇది గమనించిన వెంకటేశం మరో ట్రాక్టర్ డ్రైవర్ సాయంతో డోరును సరిచేస్తుండగా ట్రాక్టర్ ముందుకు కదిలింది. ట్రాక్టర్ను ఆపే ప్రయత్నంలో భాగంగా స్టీరింగ్ పట్టుకుని సీటులోకి ఎక్కుతుండగా వెంకటేశం కిందపడిపోయాడు. దీంతో ట్రాక్టర్ టైరు అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుమారుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అంగన్వాడీ టీచర్ల ధర్నా
భువనగిరిటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన 48 గంటల ధర్నా సోమవారం ప్రారంభించారు. ఈ సదర్భంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, సిలువేరు రమాకుమారి మాట్లాడుతూ ఐసీడీఎస్ పథకం అమల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచినా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కారానికి నోచడం లేదన్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, పదవీ విరమణ ప్రయోజనాలు వర్తింపజేయాలని, పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వడంతో పాటు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఐసీడీఎస్కు నిధులు పెంచి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని కోరారు. పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను రద్దు చేయాలన్నారు. మంగళవారం కూడా ధర్నా కొనసాగిస్తామన్నారు. సోమవార రాత్రి ధర్నా శిబిరంలోనే అంగన్వాడీలు నిద్రించారు. కార్యక్రమంలో యూనియన్, సీఐటీయూ నాయకులు సిద్ధమ్మ, సునీత, వసంత, ఉమా, పద్మ, ప్రమీల, షాహిదా, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి