రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

Mar 18 2025 10:13 PM | Updated on Mar 18 2025 10:08 PM

నేరేడుచర్ల: బైక్‌పై వెళ్తున్న బీటెక్‌ విద్యార్థి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పాలకీడు మండలం బెట్టెతండాకు చెందిన బండావత్‌ సందీప్‌(20) హైదరాబాద్‌లోని మహావీర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హోలి పండుగకు ఇంటికి వచ్చిన సందీప్‌ సోమవార నల్లగొండ జిల్లా హాలియాలో తన స్నేహితుడి వివాహానికి బైక్‌పై వెళ్తుండగా.. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలో చెరువు మూలమలుపు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ను స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి బండావత్‌ శ్రీనునాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ట్రాక్టర్‌ను తప్పించబోయి..

రాజాపేట: బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ట్రాక్టర్‌ను తప్పించబోయి అదుపుతప్పి కిందపడడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి రాజాపేట మండలం జాల గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జాల గ్రామానికి చెందిన చెవిటి ప్రభాకర్‌(32) ఆదివారం రాత్రి తనపై బైక్‌పై జాల మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లొస్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ప్రభాకర్‌ తలకు తీవ్రగాయాలు కాగా.. భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సంతోష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు..

డిండి: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన సోమవారం డిండి మండలం హజ్యతండా సమీపంలో జరిగింది. వివరాలు.. డిండి మండలం శేషాయికుంటకు చెందిన ఇంజమూరి సాయి(22) తవక్లాపూర్‌ నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. కొత్తతండాకు చెందిన జటావత్‌ శక్రునాయక్‌(55) తన బైక్‌పై చెర్కుపల్లి నుంచి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో హజ్యతండా సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయి, శక్రునాయక్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టర్‌ నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రాజు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో  బీటెక్‌ విద్యార్థి దుర్మరణం
1
1/1

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement