చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం పరిధిలో గల వల్లభ డెయిరీ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. డెయిరీ పరిశ్రమ నుంచి విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాల వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండటం లేదని పది రోజులుగా తుప్రాన్పేట గ్రామస్తులు, రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో డెయిరీలో తనిఖీలు నిర్వహించడానికి కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు వస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా డెయిరీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో చౌటుప్పల్ మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో డెయిరీ వద్దకు చేరుకున్నారు.
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం డెయిరీ సిబ్బందికి, తుప్రాన్పేట గ్రామస్తులతో మాట్లాడి సర్దిచెప్పారు. చౌటుప్పల్ సీపీ మన్మధకుమార్ ఆధ్వర్యంలో డెయిరీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫ పీసీబీ అధికారులు వస్తున్నారని భారీగా చేరుకున్న తుప్రాన్పేట గ్రామస్తులు
ఫ పరిశ్రమలోపలికి వెళ్తుండగా అడ్డుకున్న సిబ్బంది.. వాగ్వాదం, ఘర్షణ
ఫ సొమ్మసిల్లి పడిపోయిన మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి
నీటి శాంపిల్స్ సేకరణ
తుప్రాన్పేట గ్రామస్తులు, మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి ఫిర్యాదు మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వల్లభ డెయిరీలో తనిఖీలు నిర్వహించారు. ట్రీట్మెంట్ ప్లాంట్ను పరిశీలించి నీటి శాంపిల్స్ను సేకరించారు. డెయిరీ పరిసరాల్లోని బోర్ల నీటిని కూడా పరిశీలించి శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపనున్నట్లు పీసీబీ అధికారులు తెలిపారు.
వల్లభ డెయిరీ వద్ద ఉద్రిక్తత