మా భూములు కబ్జా చేశాడు
యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి కారోబార్ శివరాత్రి నెహ్రూ ప్రజాపాలన పథకాల పేరిట తమతో సంతకాలు చేయించి భూమి కాజేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. సుమారు 15 ఎకరాల భూమిని తనతో పాటు, బంధువుల పేరుపై ధరణిలో ఎక్కించాడని, అందుకు యాదగిరిగుట్ట ఆర్ఐ సహకరించాడని ఆరోపించారు. అంతేకాకుండా భర్తలు చనిపోయిన వారికి మరణ ధ్రీవీకరణ పత్రాలు ఇస్తామని చెప్పి వారి భూమిని కూడా కబ్జా చేశారని వాపోయారు. సుమారు 30 మంది భూములను అక్రమంగా తనతో పాటు తమ బంధువుల పేరున మార్పిడి చేశారని తెలిపారు. స్పందించి కలెక్టర్.. విచారణ చేపట్టాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డిని ఆదేశించారు.
సాక్షి, యాదాద్రి : కారోబార్ భూమి ఆక్రమించాడు, ధరణిలో పేరు మారలేదు, ‘మన ఊరు–మనబడి’ బిల్లులు ఇప్పించాలి, అప్పు తెచ్చి విద్యార్థులకు అల్పాహారం అందజేశాం.. ఇలా మరెన్నో సమస్యలపై బాధితులు కలెక్టరేట్ గడప తొక్కారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి వినతులు అందజేశారు. మొత్తం 60 వరకు అర్జీలు రాగా అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించి 36 ఉన్నాయి. పంచాయతీరాజ్ 11, మున్సిపల్ 3, డీఆర్డీఓ 2, సివిల్ సప్లైస్ 2, దేవాదాయ 2, ఆర్అండ్బీ, సంక్షేమ, లేబర్, కోఆపరేటివ్ శాఖలకు సంబంధించి ఒక్కొకటి చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డితో కలిసి కలెక్టర్ హనుమంతరావు అర్జీలు స్వీకరించారు. సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిష్కరించాలని సూచించారు.
● జూలూరు పీఏసీఎస్ చైర్మన్, సీఈఓలు అక్రమాలకు పాల్పడ్డారని, విచారణలో కూడా రుజువు అయినందున వారిపై చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ డైరెక్టర్లు బాలకృష్ణారెడ్డి, రామిరెడ్డి కలెక్టర్కు విన్నవించారు. ఈ విషయంపై మార్చి 1వ తేదీన కూడా వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
● బొమ్మలరామారం మండలం సోలిపేట ఎంపీపీఎస్లో 2023 అక్టోబర్ 31నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు విద్యార్థులకు అల్పాహారం అందజేశామని, ఇందుకు సంబంధించి రూ.71,627 బిల్లు రావాలని చిత్తమ్మ, అండాలు కలెక్టర్కు తెలియజేశారు.
● రాయరావుపేటలోని 30, 31 సర్వే నంబర్ భూమిలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని, వెంటనే అడ్డుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. విషయం తెలిసినా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని, మట్టితవ్వకాలను నిలిపివేయాలని కోరారు.
స్టేజీ దిగివచ్చి సమస్య ఆలకించి..
భువనగిరికి చెందిన దివ్యాంగుడు గోపాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పింఛన్ రావడం లేదు. పలుమార్లు కలెక్టరేట్కు వచ్చి వినతిపత్రాలు అందజేశాడు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో మరోమారు సోమవారం ప్రజావాణికి వచ్చి నేరుగా కలెక్టర్ను కలిశాడు. గోపాల్ను చూసిన కలెక్టర్.. తన సీటులోనుంచి లేచి అతని దగ్గరకు వచ్చాడు. వినతిపత్రం స్వీకరించి స్వయంగా సమస్య తెలుసుకున్నారు.
బిల్లుల కోసం 16 నెలలుగా తిరుగుతున్నాం
ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు–మన బడి కార్యక్రమం కింద రూ.49లక్షలతో పనులు చేపట్టానని, రూ.12లక్షలు వచ్చాయని, మిగతా బిల్లు రాలేదని ఆరె రాములు, నంద మహేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 16 నెలలుగా తిరుగుతున్నామని, బిల్లులు ఇప్పించాలని విన్నవించారు.
ఫ ప్రజావాణిలో వినతుల వెల్లువ
ఫ అత్యధికంగా భూ సమస్యలపైనే
ఫ వినతులు స్వీకరించిన కలెక్టర్
విన్నవించాం.. పరిష్కరించండి
విన్నవించాం.. పరిష్కరించండి