నాలుగేళ్లుగా పూర్తికాని నిర్మాణాలు
ఫ నిధుల లేమితో అర్ధంతరంగా ఆపేసిన కాంట్రాక్టర్లు
ఫ రోడ్ల పక్కనే కూరగాయలు, మాంసం విక్రయాలు
స్లాబ్ దశలోనే..
ఆలేరు రూరల్ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.2కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2022 మార్చిలో సిద్ధార్థ కన్సటక్షన్స్ వారు పనులు చేపట్టారు. మొత్తం 56 స్టాళ్లు కాగా కూరగాయలకు 26, నాన్వెజ్ 18, పండ్లు 8, పూల విక్రయాలకు నాలుగు కేటాయించారు. ప్రభుత్వం ఇచ్చిన నిధుల వరకు కాంట్రాక్టర్ స్లాబ్ వరకు నిర్మాణం చేసి వదిలేశారు. మిగతా పనులకు నిధులు విడుదల కాకపోవడంతో ఏడాదిన్నర కాలంగా పనులు నిలిచిపోయాయి.
భువనగిరి : జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లా, ఆర్అండ్బీ ఆవరణలో రూ.8.70 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ పనులు ప్రారంభించారు. 2022 అక్టోబర్ 2వ తేదీన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మొత్తం 192 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో వెజ్ 85, నాన్ వెజ్ 45, పూలు, పండ్లకు 15, కిరాణ సామగ్రి విక్రయానికి 15, ఇతర అవసరాలకు 32 స్టాళ్లు కేటాయించారు. పనులు తుది దశకు చేరాయి. నిర్మాణాలకు పేయింటింగ్ కూడా వేశారు. విద్యుదీకరణ, మార్కెట్ ఆవరణలో సీసీ, రోడ్లు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా రూ.1.50 కోట్లు కావాలని ఇందుకోసం గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. మంజూరు కాకపోవడంతో మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.89 లక్షలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
కూరగాయలు, పండ్లు, మాంసం ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో ఉండేలా మున్సిపాలిటీల్లో
చేపట్టిన సమీకృత మార్కెట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఏడాది లోపు పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించినా పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి నిధులు వస్తేగానీ పనులు పూర్తయి అందుబాటులోకి తెచ్చే అవకాశం లేదు.
గ్రౌండ్ ఫ్లోర్ కూడా దాటలేదు
మోత్కూరు : పట్టణంలోని పశువుల అంగడి స్థలంలో ఎకరం నాలుగు గుంటల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం మొదట రూ.2కోట్లు మంజూరు కాగా, ఆ తరువాత మరో రూ.4 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 2022 మే 5న అప్పటి ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు. జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టెండర్ ద్వారా పనులను దక్కించుకుంది. రెండు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించాల్సి ఉండగా గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ దశలో పనులు నిలిచిపోయాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. మొత్తం 48 మడిగలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో కూరగాయలకు 26, మాంసాహారం 14, పూలు, పండ్ల విక్రయాలకు 8 మడిగలు కేటాయించారు. మూడేళ్ల క్రితం పనులు నిలిచిపోయాయి.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
నిధుల కొరత వల్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు సగంలో నిలిచిపోయింది వాస్తవమే. బిల్లు రాకపోవడం వల్లే పనులు నిలిపివేశామని కాంట్రాక్టర్ చెప్పాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరోసారి వారికి వివరిస్తాం.
–సతీష్కుమార్,
మున్సిపల్ కమిషనర్, మోత్కూరు
పోచంపల్లిలో అడుగే పడలే..
భూదాన్పోచంపల్లి : మున్సిపాలిటీకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం రూ.3 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు సైతం పూర్తయ్యాయి. కానీ, అందుబాటులో ప్రభుత్వ స్థలం లేక మార్కెట్ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. పట్టణ శివారులో నిరుపయోగంగా ఉన్న రెండు ఎకరాల ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని మార్కెట్ కోసం ప్రతిపాదించి అప్పటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. కానీ, మార్కెట్కు భూమి ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు మొదల్లో సుముఖత చూపలేదు. ఆ తరువాత కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ స్థలాన్ని వినియోగించుకొని అందుకు బదులుగా ఆర్టీసీకి జలాల్పురం పరిధిలోని సర్వే నంబర్ 80లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ, ఆర్టీసీ స్థలం అప్పగింత ప్రక్రియ పూర్తికాకపోవడంతో మార్కెట్ పనులు మొదలుకాలేదు.
పిల్లర్లకే పరిమితం
యాదగిరిగుట్ట : పట్టణంలోని అంగడిబజార్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం రూ.2 కోట్లు మంజరయ్యాయి. 2022 మార్చి 23న పనులు ప్రారంభించారు. 48 మడిగెలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ, కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో పనులను పిల్లర్ల దశలోనే ఆపేశాడు.
సగంలో ఆగిన సమీకృత
సగంలో ఆగిన సమీకృత
సగంలో ఆగిన సమీకృత
సగంలో ఆగిన సమీకృత