
‘రీజినల్’ అలైన్మెంట్ మార్పించండి
చౌటుప్పల్ : అశాసీ్త్రయమైన అలైన్మెంట్ వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండు ముక్కలు అవుతుందని, ఎంతోమంది ఆస్తులు కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని, ఎలాగైనా ఉత్తరభాగంలో రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పించాలని చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాలకు చెందిన భూ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని వేడుకున్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. నిబంధనలు పాటించకుండా అలైన్మెంట్ రూపొందించడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య నిబంధనల ప్రకారం 40కిలో మీటర్ల వ్యవధి ఉండాలని, కానీ, చౌటుప్పల్ ప్రాంతంలో కేవలం 28 కిలో మీటర్ల దూరంలోనే అలైన్మెంట్ రూపొందించి తమను రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు, నివాస గృహాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటి వరకు 5 శాతం మంది నిర్వాసితులు కూడా అంగీకరింంచలేదన్నారు. ఇక్కడి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంతి నితిన్ గడ్డరీకి వివరించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ మరోసారి కేంద్ర మంత్రి దగ్గరకు తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు భూ నిర్వాసితులు తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డిని కూడా కలిసి సమస్య వివరించాలని నిర్వాసితులకు మంత్రి సూచించారు. మంత్రిని కలిసిన వారిలో భూనిర్వాసితుల ఐక్య వేదిక కన్వీనర్, చౌటుప్పల్ సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, నిర్వాసితులు దబ్బటి రాములు, సందగళ్ల మల్లేష్గౌడ్, బోరెం ప్రకాష్రెడ్డి, జాల వెంకటేష్, శ్రీశైలం, వల్లూరి బోవయ్య, దశరథ, బొమ్మిరెడ్డి ఉపేందర్రెడ్డి, పంకెర్ల యాదయ్య, చింతల సంజీవరెడ్డి, జాల జంగయ్య, మైసయ్య, అంజయ్య, రమేష్, పాండు, అనిల్, శ్రీనివాస్, జాల భార్గవి, గంగదేవి పార్వతమ్మ, చంద్రమ్మ పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రీజినల్
రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల వినతి