
సిగ్నల్స్ రాక.. సేవలందక !
రాజాపేట : అంగన్వాడీ కేంద్రాల్లో సేవల పారదర్శకత కోసం ప్రభుత్వాలు రూపొందిస్తున్న ఆన్లైన్ యాప్లతో అవస్థలు తప్పడం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఫేస్ అథెంటికేషన్ కాకపోవడం అంగన్వాడీ టీచర్లకు తలనొప్పిగా మారింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది.నెట్సిగ్నల్స్ అందకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని అంగన్వాడీ టీచర్లు అంటున్నారు.
యాప్లో వీటిని నమోదు చేస్తారు
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, లబ్ధిదారుల హాజరు, పోషకాహారం పంపిణీలో పాదర్శకత కోసం ప్రభుత్వం పోషణ్ ట్రాకర్ యాప్ అమల్లోకి తెచ్చింది. ఈ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా లబ్ధిదారుల హాజరుతో పాటు వారి పేర్లు, పోషకాహారం పంపిణీ, రోజువారీ కార్యక్రమాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు పోషకాహారం అందజేసేటప్పుడు ఫొటోలు తీసి యాప్లో డౌన్లోడ్ చేయాలి. కాగా అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ఇచ్చిన 2జీ ర్యామ్ ఫోన్లు పోషణ్ ట్రాకర్ యాప్కు సరిగా సపోర్టు చేయడం లేదు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సిగ్నల్స్ సమస్య ఏర్పడుతుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలతో పాటు పౌష్టికాహారం పంపిణీ వివరాలను ఏరోజుకారోజు యాప్లోనే నమోదు చేయాల్సి ఉంది. అయితే ఉదయం అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో యాప్ పని చేయకపోవడంతో రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ఆ తరువాత సాయత్రం వేళలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను అప్లోడ్ చేయాల్సి వస్తుంది.
లబ్ధిదారులు ..
జిల్లాలో మోత్కూరు, రామన్నపేట, ఆలేరు, భువనగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 777 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వాటిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు 29,732 మంది ఉన్నారు.
పోషణ్ ట్రాకర్ యాప్కు నెట్వర్క్ సమస్య
లబ్ధిదారుల ఫేస్ అథెంటికేషన్,
పోషకాహారం వివరాల నమోదుకు ఇబ్బందులు
యాప్లోనే నమోదు చేయాలని అధికారుల ఒత్తిడి
సతమతమవుతున్న అంగన్వాడీ టీచర్లు
ఈకేవైసీకీ ఇబ్బందులే..
ఈ కేవైసీ చేయాలంటే ఆధార్కు అనుసంధానం చేసిన ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. దానికి వచ్చిన ఓటీపీ నంబర్ ఆధారంగా ఈకేవైసీ చేస్తారు. కానీ, ఆధార్కు లింక్ చేసిన నంబర్ లేకపోవడం, మరోవైపు ఆధార్లో తప్పులు, అప్డేట్ చేయించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధి కారులేమో ఫేస్యాప్లో వివరాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయమార్గాలు చూపాలని అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వానికి కోరుతున్నారు.
నెట్వర్క్ సరిగా లేదు
అంగన్వాడీ టీచర్లకు నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం 2జీబీ ర్యామ్ ఫోన్లు ఇచ్చింది.ఈ ఫోన్లు పోషణ్ ట్రాక్ యాప్కు సరిగా సపోర్టు చేయడం లేదు. దీనికి తోడు నెట్ సిగ్నల్స్ అందకపోవడం, ఆధార్ అప్డేట్ లేకపోవడం వంటి సమస్యలతో యాప్లో వివరాలు నమోదు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి.
– బూర్గు స్వప్న, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు

సిగ్నల్స్ రాక.. సేవలందక !