చౌటుప్పల్ : తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను పొందడమే కాదు.. వారి సంరక్షణ, పోషణ బాధ్యత బిడ్డలదేనని సీనియర్ సిటిజన్, తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ ట్రిబ్యునల్ చైర్మన్ వెల్మ శేఖర్రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై శనివారం ట్రిబ్యునల్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. ఇరుపక్షాలను పిలిపించి వారి వాదనలు విన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తల్లిదండ్రులంటే ఆస్తులు సంపాదించే వరకే అనుకోవడం దుర్మార్గమన్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను అనుభవిస్తూ వారి మంచిచెడులను మాత్రంపట్టించుకోకపోవడం సరైందికాదన్నారు. ఆస్తులను తమ పేర రాయించుకుని, తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే కఠిన తీర్పులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. తల్లిదండ్రులు ట్రిబ్యునల్కు వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది ముత్యాల సత్తిరెడ్డి, సెక్షన్ ఇంచార్జి అధికారి సురేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్, సంరక్షణ,
పోషణ ట్రిబ్యునల్ చైర్మన్ శేఖర్రెడ్డి