భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన ద్వితీయ సంవత్సరం గణితం జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 4,730 మందికి గాను 4,590 మంది హాజరయ్యారు. 140 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు.
పోరుబాటతో ప్రజా
సమస్యలు వెలుగులోకి..
యాదగిరిగుట్ట: సీపీఎం చేపట్టిన పోరుబాట కార్యక్రమంతో ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో శని వారం నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. హామీల్లో ఒకటి, రెండు తప్ప ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు. పోరుబాటలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల 27, 28, 29 తేదీల్లో తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల ముట్టడి, ఏప్రిల్ రెండవ వారంలో కలెక్టరేట్ ఎదుట 48 గంటల మహాధర్నా నిర్వహిస్తామన్నారు. అంతకుముందు పోరుబాట కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కల్లూరి మల్లేశం, బబ్బూరి పోశెట్టి, గడ్డం వెంకటేష్, పెద్దకందుకూరు మాజీ సర్పంచ్ భీమగాని రాములు, బీమగాని మాధవి, మండల కమిటీ సభ్యులు కాలే స్వామి తదితరులు పాల్గొన్నారు.
రూ.2వేల కోట్లు కేటాయిస్తేనే ప్రయోజనం
మోత్కూరు : రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోత్కూరులో జరిగిన చేనేత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రిఫ్టు, చేనేత భరోసా పథకాలను ప్రకటించినా ఇప్పటి వరకు కార్యాచరణ రూపొందించలేదన్నారు. గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో నడుస్తుందన్నారు. చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ అప్పు మాఫీ చేయాలని, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచం కన్నయ్య మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ, వాటిని నేసే బాధ్యత పవర్లూమ్ యజమానులకు అప్పగించిందన్నారు. సమావేశంలో చేనేత సంఘం నాయకులు వంగరి రాములు, చుంచు లక్ష్మయ్య, వేముల నర్సయ్య, శ్రీనివాస్, దోర్నాల మత్స్యగిరి, జెల్ది సోమయ్య, పెండెం రాజారామ్, ఏలూరి మత్స్యగిరి, పోచం రాము, వాసు పాల్గొన్నారు.
జియో ట్యాగ్ నంబర్లు కేటాయించాలని వినతి
భువనగిరిటౌన్: జియో ట్యాగింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న చేనేత కార్మికులకు వెంటనే నంబర్లు కేటాయించాలని కోరుతూ చేనేత కార్మిక సంఘం సభ్యలు శనివారం చేనేత, జౌళీ శాఖ ఏడీకి వినతిపత్రం అందజేశారు. జియో ట్యాగింగ్ కోసం జిల్లాలో సుమారు 2వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, నంబర్ కేటాయించకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే జియోట్యాగ్ నంబర్ తప్పనిసరి చేసిందన్నారు.అనంతరం ఏడీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు 4,590 మంది హాజరు
ఇంటర్ పరీక్షలకు 4,590 మంది హాజరు