సాక్షి, యాదాద్రి : భానుడు రోజురోజుకూ మండిపోతున్నాడు. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో మంచినీటి ఎద్దడి తరుముకొస్తోంది. మిషన్ భగీరథ నీరు డిమాండ్కు అనుగుణంగా సప్లయ్ కాకపోగా.. వచ్చే నీటిలోనూ కొంతమేర లీకేజీలు, సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు వృథా అవుతోంది. ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించిన యంత్రాంగం.. జిల్లాలోని 17 మండలాల్లో నీటి సరఫరా స్థితిగతులను పరిగణలోకి తీసుకుని సమస్యను అధిగమించేందుకు యాక్షన్ప్లాన్ రూపొందించింది. అవసరమైన చోట ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలని, ట్యాంకర్ల దారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా నీటి వృథాను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలకు ఉపక్రమించింది.
719 ఆవాసాలకు భగీరథ నీరు
జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 719 అవాసాలకు మిషన్ భగీరథ సరఫరా జరుగుతుంది. ఇందులో 512 ఆవాసాలకు హైదారాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా, 131 ఆవాసాలకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 69 గ్రామాలకు నల్లగొండ ఉదయసముద్రం నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 14 ఎంఎల్డీలు, ఉదయ సముద్రం నుంచి 10.8 ఎంఎల్డీల నీరు ప్రతి రోజూ సరఫరా జరుగుతోంది. ఇక హైదారాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా నిత్యం 80.51 ఎంఎల్డీల నీరు రావాల్సి ఉండగా కొద్ది రోజులుగా 47.75 ఎంఎల్డీలు మాత్రమే వస్తుంది.
నల్లా కనెక్షన్లు, ట్యాంకులు ఇలా..
జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 1,221 ట్యాంకులు, 353 చేతిపంపులు, 33 బావుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం 1,56,147 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 642 ఇళ్లకు నల్లాలు లేకపోవడంతో వాటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
రోడ్డెక్కుతున్న జనం
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో జనం ఆందోళనకు దిగుతున్నారు. భువనగిరి మండలం హన్మాపురంలో నీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు ఇటీవల రోడ్డెక్కారు. అదే విధంగా వడపర్తి గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
167 ఆవాసాల్లో ముప్పు
వేసవిలో నీటి ముప్పును గ్రహించిన మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ విభాగం అధికారులు ఫిబ్రవరిలోనే క్షేత్రస్థాయిలో సర్వే చేసి నీటి ఎద్దడి పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 167 ఆవాసాల్లో ముప్పు ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ముందస్తుగానే ప్రత్యామ్నా చర్యలు చేపట్టారు. పుట్టగూడెం, మల్లాపూర్, చాకంపల్లి, ధర్మోజిగూడెం, దేశ్ముఖ్, ఎం,తుర్కపల్లి, జనగాం, శ్రీనివాసపురం గ్రామాల్లో ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకున్నారు. అవసరాన్ని బట్టి మరికొన్ని బోర్లను అద్దెకు తీసుకోనున్నారు.
వేసవి ప్రారంభంతోనే తాగునీటి ఎద్దడి
డిమాండ్ మేరకు సరఫరా కాని
మిషన్ భగీరథ జలాలు
పైపులైన్ లీకేజీలు, సాంకేతిక సమస్యలు
పరిష్కారానికి యాక్షన్ ప్లాన్
రూపొందించిన యంత్రాంగం
అవసరమైన చోట అద్దెబోర్లు,
అదనపు పైపులైన్ల ఏర్పాటు
ట్యాంకర్లతో సరఫరా చేయాలని నిర్ణయం
నీటిని వృథా చేయొద్దు
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా డిమాండ్కు అనుగుణంగా నీటి సరఫరా జరగడం లేదు. రోజూ వచ్చే నీటిలో దాదాపు సగానికి తగ్గాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతోంది. సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. అవసరమైన ప్రాంతాల్లో అద్దె బోర్లు తీసుకుంటున్నాం. అదనపు పైప్లైన్లు వేస్తున్నాం. నీటిని వృథాగా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి.
– కరుణాకర్, మిషన్ భగీరథ ఈఈ
అప్రమత్తంగా ఉండాలి
బీబీనగర్ : తాగునీటి సరఫరా విషయంలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలో ఆమె శనివారం పర్యటించారు. గ్రామంలో తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. నిరుపయోగంగా ఉన్న బోర్లను పరిశీలించారు. ప్రతి ఇంటికీ నీటి స్వచ్ఛమైన నీటి సరఫరా జరగాలన్నారు. ఆమె వెంట ఏంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవికిరణ్, పంచాయతీ కార్యదర్శి బాలలక్ష్మి ఉన్నారు.
వృథా అరికట్టకపోతే కటకటే!