
ఏప్రిల్ 20నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
భువనగిరి : సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి కి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని శుక్రవారం సబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
టెన్త్ ప్రశ్న పత్రాలు నేడు మండలాలకు చేరవేత
భువనగిరి : పదో తరగతి పరీక్షలకు సంబంధించి సెట్ వన్ ప్రశ్న పత్రాలు శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరాయి. వీటిని శనివారం మండల కేంద్రాలకు తరలించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 8,631 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
నేత్రపర్వం.. ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం జరిపించారు. ఆండాళ్దేవికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. ఇక ప్రధానాలయంలో నూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివా రిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్టా అలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం సుదర్శన హక్షమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు.
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి
భూదాన్పోచంపల్లి : రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు కూడా రూ.2లక్షల లోపు రుణాలు మాఫీ చేయాలని చేనేత జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల్లోనూ చాలా మంది నిరుపేదలు ఉన్నారని, నేత వృత్తిపైనే వారి కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రుణాలు చెల్లించలేకపోతున్నారని, వడ్డీలు పెరిగిపోయినట్లు తెలిపారు. చాలా మంది కార్మికులు రూ,లక్షకు పైగా బకాయి పడ్డారని వారందరికీ రూ.2లక్షల లోపు మాఫీ చేయాలని పేర్కొన్నారు. రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులకు ఆర్థిక భారం నుంచి విముక్తి లభించనుందన్నారు.
ఐఈఆర్పీలను క్రమబద్ధీకరించాలి
నాగారం: రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు విద్యాబోధన చేస్తున్న ఐఈఆర్పీ(ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లను సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రెగ్యూలరైజ్ చేయాలని ఐఈఆర్పీల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023–24 లెక్కల ప్రకా రం 81వేల మంది దివ్యాంగ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదై ఉన్నారని, వీరికి 790 మంది ఉపాధ్యాయులు 19 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు.