
శాశ్వత మరమ్మతులు జరిగేనా!
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వే మరమ్మతులు ఈ ఏడాది కూడా జరిగేలా లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా ఏడు సంవత్సరాలు మరమ్మతులకు నోచుకోలేదు. స్పిల్వేపై చాలా లోతుగా గుంతలు పడడంతో లోపలివైపు నుంచి నీటిజాలు రావడం మొదలైంది. 2014 నుంచి 2021 సంవత్సరం వరకు స్పిల్వే మరమ్మతులకు నోచుకోలేదు. స్పిల్వే మరమ్మతుల ఆవశ్యకతపై నిపుణుల హెచ్చరికల మేరకు 2022 సంవత్సరం జులైలో స్పిల్వే మరమ్మతు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎట్టకేలకు 2023లో మరమ్మతులు చేశారు. ఆ సంవత్సరం వరదలు రాకపోవడంతో డిసెంబర్ వరకు పనులు కొనసాగాయి. అయితే, 2024లో సాగర్ ప్రాజెక్టుకు వరద ఎక్కువ రావడంతో అత్యధిక రోజులు గేట్లు ఎత్తారు. దీంతో స్పిల్వే నీటి వత్తిడికి కోతకు గురై మళ్లీ గుంతలుపడ్డాయి. ఎప్పటిలాగే స్పిల్వేపై పెద్దపెద్ద క్యావిటీ(గుంతలు)లు ఏర్పడ్డాయి. వాటికి మరమ్మతులు చేసేందుకు టెండర్లు పిలిచి సంబంధిత సంస్థలకు పనులు అప్పగించాల్సి ఉంది. దీనిపై జనవరి 6న భారీ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించి స్పిల్వే మరమ్మతులు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీచేశారు.
శాశ్వత మరమ్మతులకు
పలు సంస్థలతో సంప్రదింపులు
స్పిల్వే శాశ్వత ప్రాతిపదిక మరమ్మతులు చేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో సాగునీటిశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవలే రూర్కేలా ఐఐటీ వారు సర్వే నిర్వహించారు. వీరే కాకుండా మరో సంస్థ కూడా స్పిల్వేను సందర్శించింది. శాశ్వత మరమ్మతులు చేయడం సాధ్యం కాకున్నా.. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేందుకు కనీసం శాశ్వత ఏర్పాట్లు చేయడానికై నా సలహాలు ఇవ్వాలని కోరారు. దీంతో స్పిల్వే దిగువ భాగాన కదిలే క్రేన్లను ఏర్పాటు చేసి దాని నుండి సులభంగా మరమ్మతులు చేసేందుకు క్వావిటీల కొలతలు తీసేందుకు వీలవుతుంది. అలాగే స్టీల్ రాడ్స్, కాంక్రీట్ పైకి పంపడానికి సులభమవుతుందనే అంచనాలకు వచ్చినట్లు సమాచారం. అందుకుగాను క్రేన్లను ఏర్పాటు చేసేందుకు అంచనాలు త యారికీ సంస్థల సంప్రదింపులకు టెండర్ల ఆహ్వానానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎలక్ట్రికల్ పనులకు టెండర్లు
సాగర్డ్యాం ఎడమవైపు గల మెయిన్ కంట్రోల్ప్యానల్ ఎలక్ట్రికల్ పనులను నీటిపారుదల శాఖ సర్కిల్ నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లకు ఈ నెల 3న ప్రకటన చేశారు. ప్యానల్బోర్డులు పాతవి తొలగించి కొత్తవి కేబుల్తో పాటు మరికొన్ని విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
నాగార్జునసాగర్
ప్రాజెక్టు స్పిల్వే
ఫ సాగర్ స్పిల్వేకు ప్రతిసారి తాత్కాలిక పనులే చేస్తున్న ప్రభుత్వాలు
ఫ శాశ్వత ప్రాతిపదికన మరమ్మతుల కోసం పలు సంస్థలతో అధ్యయనం
ఫ ఈ యేడాది తాత్కాలిక మరమ్మతులకు కూడా ఇప్పటి వరకు కార్యాచరణ లేదు
ఫ గత సంవత్సరం అత్యధిక వరదలతో స్పిల్వేపై మళ్లీ గుంతలు
నేటి నుంచి మొదలు కానున్న క్రస్ట్గేట్ల నిర్వహణ పనులు
ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే జలాశయంలోని నీరు స్పిల్వే దిగువకు వెళ్లింది. దీంతో శనివారం నుంచి క్రస్ట్గేట్ల నిర్వహణ పనులు మొదలు పెట్టనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. డ్యాం సాధారణ నిర్వహణ పనులకుగాను రూ.40లక్షలు ఖర్చవుతాయని అంచనాలను పంపినట్లు తెలిపారు. గ్యాలరీలలోని నీటిని పంప్చేయడంతో పాటు చిన్నచిన్న పనులు చేయడం, సీసీ కెమెరాల మెయింటెనెన్స్, కుడి, ఎడమ కాల్వల గేట్స్ నిర్వహణకు గ్రీజింగ్, రబ్బరు సీళ్లు అమర్చడం, నట్బోల్ట్స్ బిగింపు తదితర పనులు చేస్తారు. అలాగే స్పిల్వే దిగువ భాగాన గల బకెట్ పోర్షన్లో నీటిని డీవాటరింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.