రిటైర్డ్‌ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్‌ చేసి.. | - | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్‌ చేసి..

Mar 13 2025 11:15 AM | Updated on Mar 13 2025 11:15 AM

రిటైర్డ్‌ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్‌ చేసి..

రిటైర్డ్‌ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్‌ చేసి..

మిర్యాలగూడ అర్బన్‌: అటవీశాఖ రిటైర్డ్‌ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులను మిర్యాలగూడ టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్‌) మండలం గట్టుమీదితండాకు చెందిన ఆంగోతు గణేష్‌, ఎల్లాపురం తండాకు చెందిన కుర్ర శంకర్‌ వరసకు బావబావర్దులు. గణేష్‌కు మిర్యాలగూడకు చెందిన అటవీశాఖ రిటైర్డ్‌ ఉద్యోగి పరిచయమయ్యాడు. సదరు రిటైర్డ్‌ ఉద్యోగి వృద్ధాప్యంలో తనకు కేర్‌ టేకర్‌గా గణేష్‌కు పెట్టుకున్నాడు. అయితే రిటైర్డ్‌ ఉద్యోగి వద్ద ఉన్న డబ్బులను కాజేయాలని గణేష్‌ పథకం రచించాడు. ఎలాగైనా అతడి పరువుకు నష్టం కలిగించి బెదిరించి డబ్బులు గుంజాలని గణేష్‌ అనుకున్నాడు. 2022 జూన్‌ 11న అటవీశాఖ రిటైర్డ్‌ ఉద్యోగి, గణేష్‌ పని నిమిత్తం సూర్యాపేటకు వెళ్లారు. పథకం ప్రకారం రిటైర్డ్‌ ఉద్యోగికి గణేష్‌ ఎక్కువగా మద్యం తాగించాడు. అతడు స్పృహతప్పిన తర్వాత గుర్తుతెలియని మహిళకు డబ్బు ఆశచూపి సదరు రిటైర్డ్‌ ఉద్యోగితో ఆమెను కలిపి అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ఫొటోలు వీడియోలు రిటైర్డ్‌ ఉద్యోగికి పంపిన గణేష్‌ డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 2022 నుంచి 2024 వరకు 19 ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ ప్రామిసరీ నోట్లను రిటైర్డ్‌ ఉద్యోగి కుమార్తె, అల్లుడికి చూపించి అసలు వడ్డీతో కలిసి రూ.46 లక్షలు తీసుకున్నాడు. గణేష్‌కు అతడి భార్య, బావమరిదికి శంకర్‌ సహకరించడంతో మళ్లీ బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. దీంతో బాధితుడు రూ.2.55లక్షలు ఫోన్‌పే ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అయినా వారి వేధింపులు ఆగకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. దీంతో బాధితుడి కుటుం సభ్యులు మిర్యాలగూడ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గణేష్‌, అతడి బావమరిది శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, 4.5 తులాల బంగారం (ముత్తూట్‌ ఫైనాన్స్‌లో ఉంది), స్మార్ట్‌ఫోన్‌, 10 ఒరిజనల్‌ ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. గణేష్‌పై విజయపురి టౌన్‌, తిరుమలగిరి(సాగర్‌), వాడపల్లి పోలీస్‌ స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నాయని, పదేపదే నేరాలకు పాల్పడుతున్న అతడిపై రౌడీషీట్‌ తెరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ టూటౌన్‌ సీఐ నాగార్జున, ఎస్‌ఐలు డి. హరీష్‌రెడ్డి, బి. రాంబాబు, కానిస్టేబుళ్లు పి. బాలకృష్ట, కళ్యాణ్‌, అక్బర్‌, రామకృష్ణ, రమేష్‌నాయక్‌, సూర తదితరులు పాల్గొన్నారు.

ఫ డబ్బులు వసూలు చేసిన ఇద్దరు

నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement