పోలీస్‌ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

Mar 12 2025 7:10 AM | Updated on Mar 12 2025 7:09 AM

తుంగతుర్తి: కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాలని పోలీసులు ఫోన్‌ చేయడంతో భయపడిన యువకుడు పోలీస్‌ స్టేషన్‌లో పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తుంగతుర్తి పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం రాత్రి జరిగింది. స్థానిక ఎస్‌ఐ రుద్రకాంత్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి నాగయ్యకు అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వ గ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా.. నాగయ్య భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో భార్యను కాపురానికి రమ్మని పిలవడానికి సోమవారం నాగయ్య అత్తవారి ఇంటికి వెళ్లగా.. మాటామాట పెరిగి ఘర్షణ జరిగింది. దీంతో అత్తింటివారు అతడిపై చేయి చేసుకున్నారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌కు రావాలని పోలీసులు ఫోన్‌ చేయడంతో భయపడి నాగయ్య తుంగతుర్తి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడికి తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. నాగయ్య ఆరోగ్యం కుదుటపడ్డాక పోలీస్‌ స్టేషన్‌కు రావాలని.. భార్యాభర్తలకు కౌన్సిలింగ్‌ ఇస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement