
ప్రదక్షిణలే.. పరిష్కారమేదీ?
ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం
282 అర్జీలు పెండింగ్
కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో 2024 జూన్ 10నుంచి 2025 జనవరి 16వ తేదీ వరకు 900 అర్జీలు వచ్చాయి. ఇందులో 618 పరిష్కారానికి నోచుకోగా ఇంకా 282 అర్జీలు వివిధ కారణాలతో పెండింగ్ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 102 దరఖాస్తులు భువనగిరి ఆర్డీఓ, 27 మోటకొండూరు, 20 యాదగిరిగుట్ట, 15 గుండాల పరిధిలో ఉన్నాయి.
ఫ వివిధ కారణాలతో కాలయాపన
ఫ పదేపదే కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్న బాధితులు
ఫ భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్ల కోసం ఎక్కువగా విన్నపాలు
సాక్షి, యాదాద్రి : ‘అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన నిమ్మల రాముకు మూడేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. కుడికాలు, కుడిచేయి చచ్చు పడ్డాయి. పింఛన్కోసం రెండేళ్ల క్రితం కలెక్టరేట్కు వచ్చి ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాడు. మంజూరు కాకపోవడంతో ఆ తరువాత పలుమార్లు వినతులు అందజేశాడు. సోమవారం కూడా స్వగ్రామం నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్కు భార్య, తండ్రితో కలిసి వచ్చి వినతిపత్రం అందజేశాడు.
60 ఏళ్లుగా తమ వ్యవసాయ బావుల వద్దకు ఉన్న బాటను కొందరు వ్యక్తులు ఆక్రమించారని, న్యాయం చేయాలని వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన ఐలమ్మ, సుగుణమ్మలు ప్రజావాణిలో కొంతకాలం క్రితం వినతులు అందజేశారు. రెవెన్యూ అధికారులను పంపి సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో ఉన్నతాధికారి వారితో చెప్పారు. ఆతరువాత ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో మరోసారి ప్రజావాణికి వచ్చి అర్జీలు అందజేశారు. ఇలా.. ఒక సమస్యతో వచ్చిన వారే పదేపదే తిరిగి వస్తూ విన్నవించుకుంటున్నారు. వినతిపత్రాలు తీసుకునే సమయంలో అధికారులు హామీలైతే ఇస్తున్నారు. కానీ, సమస్య అలాగే ఉండిపోతోంది. కలెక్టరేట్కు ప్రదక్షిణలు చేయడమే తప్ప.. సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ చాలా మంది బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విన్నపాల్లో అధికంగా భూసమస్యలు, రేషన్కార్డులు, ఇళ్లు, పింఛన్లకు సంబంధించినవే ఉంటున్నాయి.
నెల రోజుల తరువాత ప్రజావాణి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో నిలిచిపోయిన ప్రజావాణి తిరిగి సోమవారం ప్రారంభమైంది. నెల రోజుల తరువాత ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్ధరించడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి విన్నపాలు అందజేశారు. మొత్తం 60 అర్జీలు రాగా అందులో 40 వినతులు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. ఐదు గ్రామీణాభివృద్ధి, 4 మున్సిపల్, 2 చేనేత, 2 పంచాయతీరాజ్కు సంబంధించినవి ఉన్నాయి. మత్స్య, వ్యవసాయ, శిశు సంక్షేమం, మార్కెటింగ్, విద్యుత్, వైద్యశాఖకు సంబంధించిన వినతులు ఒక్కోటి చ వచ్చాయి. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, జెడ్పీ సీఈఓ శోభారాణి తదితరులు వినతులు స్వీకరించారు.
సోమవారం వచ్చిన వినతుల్లో కొన్ని..
● రోడ్డు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. 30 ఫీట్ల రోడ్డును 10 ఫీట్ల మేర ఆక్రమించారని, దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని విన్నవించారు.
● గుండాల మండలానికి దేవాదుల నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ వె ల్మజాల గ్రామానికి చెందిన రాజయ్య వేడుకున్నారు. తా ను ఐదు ఎకరాల్లో వరి సాగు చేశానని, రూ.లక్షల వరకు పెట్టుబడి పెట్టానని, భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు సరిగా పోయడం లేదన్నారు. దీంతో ఇప్పటికే కొంత పొలం ఎండి పోయిందన్నారు. గుండాల మండలంలో చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని, దేవాదుల నుంచి గోదావరి జలాలను విడుదల చేస్తే తప్ప.. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. అలాగే ఎండిన పంటలు ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం చెల్లించాలని విన్నవించారు.
బోర్లు ఎండిపోతున్నాయి.. ఇసుక రవాణాను అడ్డుకోండి
రాజాపేట మండలం రేణికుంట, బేగంపేట వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, వెంటనే అడ్డుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, నాయకులు ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇసుక తరలించడం వల్ల వాగు పరీవాహకంలో బోర్లు ఎండిపోతున్నాయని, నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకునేందుకువెళ్లిన రైతులపై దాడి చేస్తున్నారని పే ర్కొన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్పందిస్తూ ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, సీసీ రోడ్లకు మాత్రమే ఇసుక రవాణాకు పర్మిషన్ ఉందని, ఇసుక రవాణాను అడ్డుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు.

ప్రదక్షిణలే.. పరిష్కారమేదీ?

ప్రదక్షిణలే.. పరిష్కారమేదీ?

ప్రదక్షిణలే.. పరిష్కారమేదీ?