10వ తేదీ నుంచి ‘ప్రజావాణి’ పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

10వ తేదీ నుంచి ‘ప్రజావాణి’ పునరుద్ధరణ

Mar 9 2025 1:28 AM | Updated on Mar 9 2025 1:27 AM

భువనగిరి టౌన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 10వ తేదీనుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్‌ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని, కోడ్‌ ముగిసినందున తిరిగి పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని, సమస్యలు ఉంటే ప్రజావాణికి వచ్చి వినతులు అందజేయాలని సూచించారు.

లక్ష సంతకాల సేకరణ ప్రారంభం

భువనగిరి టౌన్‌ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శనివారం భువనగిరిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పదవుల్లో దివ్యాంగులను నామినేట్‌ చేయడానికి వీలుగా చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది దివ్యాంగుల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే భువనగిరి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌, జిల్లా అధ్యక్షుడు సుర్పంగ ప్రకాష్‌, కోశాధికారి కొత్త లలిత పాల్గొన్నారు.

డీసీపీకి ఘనంగా వీడ్కోలు

భువనగిరి : బదిలీపై కామారెడ్డి జిల్లా ఎస్పీగా వెళ్తున్న డీసీపీ రాజేశ్‌చంద్రకు శనివారం పోలీ సులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది ఇరువైపులా నిల్చొని పూలవర్షం కురిపించారు. డీసీపీతో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

రామన్నపేట : విష్ణుకుండినుల రాజధానిగా వెలుగొందిన ఇంద్రపాలనగరంను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో ఇంద్రపాలనగరంలో పర్యటించారు. పెద్దచెరువు సమీపంలో ఆసిప్‌నహర్‌ కాలువ వంతెన, తూములను పరిశీలించారు. 120 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనలు, తూములకు మరమ్మతులు చేయించి రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆసిఫ్‌నహర్‌ కాలువ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశంసభ్యులు మీర్‌ఖాజా, గన్నెబోయిన శ్రీనివాస్‌, కొంగరి నర్సింహ, కంఠేశ్వర్‌ రమేష్‌, రాధారపు మల్లేశం, బోనగిరి శ్రీనివాస్‌, కొమ్మగాని అశోక్‌, నాగు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

10వ తేదీ నుంచి ‘ప్రజావాణి’ పునరుద్ధరణ  1
1/1

10వ తేదీ నుంచి ‘ప్రజావాణి’ పునరుద్ధరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement