న్యూస్రీల్
కొత్త రుణాల మంజూరు ఎప్పుడు ?
కాలనీల్లో అరకొర వసతులు
చంద్రబాబు పాలనలో పేదల సొంతింటి కల సాకారానికి గ్రహణం పట్టింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జిల్లాలో లక్షలాది మందికి ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేశారు. చాలా ఇళ్లు పూర్తయ్యి వందలాది కాలనీలు ఏర్పడగా కొన్ని చోట్ల పూర్తి కావాల్సి ఉంది. అయితే చంద్రబాబు రాకతో ఇళ్ల నిర్మాణం అటకెక్కింది. వాటిలో కొన్ని పూర్తి చేసి ఇప్పుడు అట్టహాసంగా వాటినే ప్రారంభిస్తున్నారు తప్ప.. బాబు పాలనలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు.
మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026
ఆకివీడు: పేదవాడి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుండటంతో పలువురు నిరుపేదలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ ఇల్లు పూర్తవు తుందని ఆశించినా, రెండేళ్లు కావస్తున్నా అమలు కాకపోవడంతో ఆ ఆనందం కాస్తా ఆవేదనగా మారుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా గృహప్రవేశాలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పూర్తయిన ఇళ్లు కొద్దిగా మాత్రమే ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిని ఎంపిక చేసి నామమాత్రంగా గృహప్రవేశాల వేడుకలు జరుపుతున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుత పాలనలో జిల్లా వ్యాప్తంగా కేవలం 595 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది.
రూ.4.50 లక్షల కోసం ఎదురుచూపు
పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ.4.50 లక్షల నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రూ.2.50 లక్షలకే పరిమితం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అరకొర నిధుల మంజూరుపై కూడా లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వంతు నిధులు మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కాకపోవడంతో కొత్త రుణాలు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎన్నికల హామీ ప్రకారం రూ.4.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.
ఆ స్థలాల్లో నిర్మాణం ఎండమావేనా?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పేదల కోసం కొనుగోలు చేసి సేకరించిన స్థలాల్లో నేటికీ ఇళ్లు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల పట్టాలిచ్చినా లేఅవుట్లు వేసి విభజించకపోవడం, మరికొన్ని చోట్ల లే అవుట్ల విభజన జరగకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో మట్టి పూడిక పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో మట్టి పూడిక పూర్తయిన చోట కూడా లబ్ధిదారులకు కేటాయింపులు జరగలేదు. దీంతో తమ సొంత ఇంటి కల నెరవేరుతుందా లేదా అని పేదలు నిరుత్సాహంతో ఉన్నారు.
సొంత ఇంటి నిర్మాణం కోసం జిల్లాలోని లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది కొత్త రుణాల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన వేలాది దరఖాస్తులను హౌసింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించి, జిల్లా వ్యాప్తంగా 16,773 మందిని అర్హులుగా తేల్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ కొత్త రుణాలను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందా? అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
గతంలో నిర్మించిన జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్, మంచినీరు, రోడ్ల నిర్మాణం కొంతమేర జరగగా.. ప్రభుత్వం మారిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు బ్రేక్ పడింది. రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేక కాలనీవాసులు నరకం చూస్తున్నారు. వర్షాకాలంలో కాలనీలు లోతట్టుగా ఉండటంతో నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరకొర వసతులు.. అందని నిధులు
నాడు మొదలు పెట్టిన ఇళ్లకే ప్రారంభోత్సవాలు
ఒక్క సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు సర్కారు


