తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులం, మతం, పార్టీ భేదాల్లేకుండా సంక్షేమ పాలనతో అందరికీ న్యాయం చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఇరగవరం కాలనీకి చెందిన దళిత యువతితో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో కావాల్సిన వారికి మాత్రమే లబ్ధి చేకూరుస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్రెడ్డి ఐదేళ్లు పాలించారని, నేడు మా వాళ్లకే చేయాలనే ఉద్దేశం ఉండడం దురదృష్టకరమని స్పష్టం చేశారు. ఇరగవరం కాలనీలో ఉన్న శ్మశాన వాటిక వ్యవహారంలో కేసులు నమోదుచేశారని యువకులు ఆవేదన చెందుతున్నారని, అందరికీ అండగా ఉంటానని చెప్పారు. ఏ ఇబ్బంది వచ్చినా లీగల్ టీం ఉందని వారు చూసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ తణుకు పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఇరగవరం కాలనీలో ఎంతో అభివృద్ధి చేశారని, అడగంగానే కమ్యూనిటీ హాలును నిర్మించారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, వల్లూరి బుజ్జిబాబు, పోతుల దొరబాబు, పడాల బాలు, నేలపాటి ఏసేపు, నేలపాటి సురేంద్ర, దిడ్ల సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి


