నర్సాపురం రూరల్: మాధవాయిపాలెం ఫెర్రీ వేలం పాట పేరుతో సోమవారం అధికారులు వ్యవహరించిన తీరు, వేలం జరిగిన విధానంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడేలా ఈ పక్రియ సాగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో రేవు వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల ఆదాయం లభించగా ప్రస్తుతం ఆ మొత్తం భారీగా తగ్గిపోయింది. శ్రీ విఘ్నేశ్వర సాండ్ క్వారీ బోట్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ.3,70,01,000కు పాటను దక్కించుకుంది. రూ.3,59,06,322కి ప్రభుత్వం ప్రారంభ పాట నిర్ధేశించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం టేకుశెట్టిపాలెంకు చెందిన శ్రీ విఘ్నేశ్వర సాండ్ క్వారీ అండ్ బోట్స్ మేన్ లేబర్ కాంట్రాక్ట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ,3,60,09,999కు, నరసాపురం ప్రాథమిక మైరెన్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ.3,60,06,333కు సీల్డ్ కవర్ వేశారు. బహిరంగ వేలంలో నర్సాపురం ప్రాథమిక మైరెన్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రూ. 3,00,70,000కు పాడగా, శ్రీ విఘ్నేశ్వర లిమిటెడ్ రూ.3,70,01,000కు బహిరంగ వేలంలో పాడారు. కేవలం పాటలో పాల్గొనే వారికి మాత్రమే లోనికి వచ్చేందుకు అవకాశం కల్పించారు. ఇతరులు ఎవరు ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పహారాలో వేలం నిర్వహించడంతో వేలం పాట నిర్వహణలో పారదర్శకత లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా కొత్త నిబంధనలను చేర్చి ఆసక్తి కలిగిన పాటదారులను దూరం చేసే ప్రయత్నం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ వేలం పాటలో జేఏసీ సభ్యులుగా కొనసాగుతున్న నరసాపురం, సఖినేటిపల్లి ఎంపీపీలు మైలాబత్తుల సోనీ, వీరా మల్లికార్జున రావు, నరసాపురం, సఖినేటిపల్లి ఎంపీడీవోలు వీకె వీరభద్రరావు, పీఆర్సి రాజ్ కుమార్, తదితరులు వేలం ప్రక్రియను పరిశీలించారు.
తగ్గిన ఆదాయం..
అధికారుల తీరుపై విమర్శలు


