క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్న దృశ్యం
బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన స్థానిక శివాలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం గణపవరంనకు చెందిన తాళ్లభోగి సురేష్, కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడతో పొగాకు పనుల నిమిత్తం వచ్చి కంసాలిపాలెంలో నివాసముంటున్నారు. మనవడు చిన్నా పానీపూరీ అడగడంతో సురేష్ కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడు చిన్నాతో కలిసి ద్విచక్రవాహనంపై బుట్టాయగూడెం వస్తున్నారు. అదే సమయంలో స్థానిక అరుంధతీ కాలనీకి చెందిన ఉండ్రాజవరపు కాంతారావు, మరొక యువకుడు ద్విచక్ర వాహనంపై బుట్టాయగూడెం నుంచి శివాలయం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రియాంక, చిన్ని, శ్రావణిలకు స్వల్ప గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే వైద్య సేవలు అందించారు. అనంతరం కాంతారావు, సురేష్లను జంగారెడ్డిగూడెం తరలించగా సురేష్ పరిస్థితి తీవ్రంగా ఉండడంతో రాజమండ్రి తరలించారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 26వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు భద్రాచలం వైపు, తిరిగి 27వ తేదీ శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం భద్రాచలం నుంచి ఆయా డిపోలకు చేరుకుంటాయన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని ఆమె స్పష్టం చేశారు.


