నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
ఏలూరు(ఆర్ఆర్పేట) : నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిమ్మ, పౌల్ట్రీ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. నిమ్మకాయ ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. నిమ్మకాయలకు కనీస ధరలు రాకపోవడంతో జిల్లాలో చాలా చోట్ల రైతులు నిమ్మ తోటలు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిమ్మ తోటలు కౌలుకు తీసుకుని తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డు ధర తగ్గి నష్టపోతున్న పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
దెందులూరు: ప్రతిభ ప్రతి ఒక్కరికి గుర్తింపు తీసుకొస్తుందని ఏలూరు జిల్లా డీఎస్డీఓ అజీజ్ అన్నారు. శుక్రవారం ఏలూరు రూరల్ మండలం మల్కాపురం ఆశ్రం వైద్యశాల ఆడిటోరియంలో దివ్యాంగుల క్రికెట్ పోటీలు జరిగాయి. దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో విజేతగా ఏపీ జట్టు నిలిచింది. విజేతను రూ.50 వేల నగదు ట్రోఫీతో సత్కరించారు. మూడు రోజుల దివ్యాంగుల క్రికెట్లో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహక నగదుతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. ఏలూరు జిల్లా డీఎస్డీఓ అజీజ్ మాట్లాడుతూ దివ్యాంగుల క్రికెట్ క్రీడను ప్రోత్సహించేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆశ్రం కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు, గుప్తా ఫౌండేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎన్ ఫౌండేషన్ అధినేత నారా శేషు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత మెన్ అండ్ ఉమెన్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ రెడ్డి, క్రికెట్ అకాడమీ సెక్రటరీ మదన్ పాల్గొన్నారు.
నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి


