
స్మార్ట్ పరేషన్
న్యూస్రీల్
గతంలో అన్ని సేవలు ఇంటికే..
20 శాతం కూడా పంపిణీ చేయని వైనం
కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నాం
కూటమి ప్రభుత్వం కొత్తగా అందిస్తున్న స్మార్ట్ రేషన్కార్డులు ఇంకా ఇవ్వకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పాత రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కొందరికే అందడంతో తమ కార్డు ఉందో లేదోనని లబ్ధిదారులు ఎదురుస్తున్నారు.
● మందకొడిగా స్మార్ట్ కార్డుల పంపిణీ..
● గందరగోళంలో లబ్ధిదారులు
● కొందరికే అందడంతో ఆందోళన
● పంపిణీలో పర్యవేక్షణ లోపం
గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
తణుకు అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీలో భాగంగా మొదటి దఫాలో గత నెల 25 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో స్మార్ట్ కార్డుల పంపిణీని కూటమి నేతలు అట్టహాసంగా మొదలుపెట్టారు. మొదట ఎమ్మెల్యేలు, ఆ తరువాత వార్డు నాయకులు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీలో భాగంగా లబ్ధిదారులతో ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా స్మార్ట్ కార్డులు పంపిణీ మాత్రం మందకొడిగా సాగుతుండడంతో తమ కార్డు ఉందో తెలియని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారు. ఒక ఇంటికి స్మార్డ్ కార్డు ఇవ్వగా, పక్కనే ఉన్న మరో ఇంట్లో కార్డు అందకపోవడంతో లబ్ధిదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రచారం చేసుకున్నంత వేగంగా కార్డులు పంపిణీ చేయకపోవడంతో ఏర్పడిన గందరగోళంలో లబ్ధిదారులు చౌక డిపోలు, గ్రామ, వార్డు సచివాలయాలు, తహసీల్దారు కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. రేషన్ కార్డులో ఉన్న నంబరు ప్రకారం ఆయా రేషన్ డిపోల్లో ఇస్తారని అధికారులు చెబుతుండడంతో ఆ నంబరు రేషన్ డిపోల వద్దకు వెళ్లేందుకు లబ్ధిదారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
స్మార్ట్ కార్డుల గందరగోళం : స్మార్ట్ కార్డులు ఇంటి గుమ్మంలోకి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంటి గుమ్మంలోకి కార్డులు రాకపోవడంతో లబ్ధిదారులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. గతనెల 31 వరకు సచివాలయాల్లో కార్డులు ఉన్నప్పటికీ కార్డులు అందజేయడంలో సంబంధిత సిబ్బంది విఫలమయ్యారు. సచివాలయాలకు వస్తున్న లబ్ధిదారులకు కార్డులు రేషన్డిపోల వద్ద ఉన్నాయని సచివాలయ సెక్రటరీలు చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఏదోక రకంగా ఇబ్బందులు వస్తున్నాయని, ఇప్పటికే దివ్యాంగ పింఛన్లలో అధిక శాతం అనర్హులుగా చూపించారని ఈ కార్డులు కూడా ఏమవుతాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకంలోను రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే పరిస్థితుల్లో స్మార్ట్ కార్డులు అందకపోతే ఎలా అని తలపట్టుకుంటున్నారు. లబ్ధిదారులకు బయో మెట్రిక్ వేలిముద్ర, ఫేస్, ఐరిస్, ఆధార్ ఓటీపీ ఆప్షన్లలో ఒక దానిని ఎంచుకుని స్మార్ట్ కార్డు అందచేయాలి.
తలపట్టుకుంటున్న రేషన్ డీలర్లు
స్మార్ట్ రేషన్ కార్డులు రేషన్ డీలర్లు ఇవ్వాలని అధికారులు చెబుతున్నారని అయితే రేషన్ సరుకులే ఇవ్వాలా, కార్డులు వెతుక్కుని కార్డులే ఇవ్వాలా అని రేషన్ డీలర్లు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే రేషన్ కోసం లబ్దిదారులు క్యూలో ఉంటున్నారని, స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో సంక్షేమానికి సంబంధించిన అన్ని సేవలు ఇంటి గుమ్మంలోకే అందించేవారు. వలంటీర్లు ఇంటి గడపలోకి వెళ్లి దరఖాస్తులు సేకరించడంతోపాటు తిరిగి ధ్రువ పత్రాలను ఇంటికెళ్లి అందజేసేవారు. దీంతో ఎలాంటి జాప్యం లేకుండా గంటల వ్యవధిలోనే ప్రతి సేవ ఇంటికి చేరేది. స్మార్ట్ కార్డు పంపిణీకి సంబంధించి గతనెల 25న ప్రారంభించి పది రోజులు గడిచినా ఇంతవరకు జిల్లాలో 20 శాతం కూడా కార్డులు పంపిణీ చేయలేని దుస్థితి. ఇంటికెళ్లి కార్డులు పంపిణీ చేయాలని కొన్ని మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఆదేశాలిస్తున్నా కొందరు సెక్రటరీలు ఆయా సచివాలయాలకు రావాల్సిందేనని చెబుతున్నారు. సచివాలయాలకు వెళ్లినా సదరు సీటులో సంబంధిత సెక్రటరీ ఉండకపోవడం, ఫీల్డుకు వెళ్లారనే సమాధానాలతో లబ్ధిదారులకు చిర్రెత్తుకొస్తుంది. ఒకవేళ వృద్ధులు వెళ్లలేని స్థితిలో ఉండి వారి తరఫున ఎవరైనా వెళ్లినా ఆధార్ ఓటీపీ ద్వారా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ లబ్ధిదారులు రావాల్సిందేనని గుర్రుగా చెబుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇళ్లకే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు సైతం స్మార్ట్ కార్డుల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక కార్డు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో గతనెల 25న కార్డుల పంపిణీ ప్రారంభించగా జిల్లాలో 5,61,408 రేషన్ కార్డులకు గాను 1,10,599 కార్డులు మాత్రమే బుధవారం సాయంత్రానికి పంపిణీ చేశారు. ఇంకా 4,50,809 కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. ఏలూరు జిల్లాలో గతనెల 30 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభించగా 6,25,666 కార్డులకు 80,583 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన 5,45,083 కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గందరగోళంగా ఉంది. కొంతమందికి ఇస్తుండగా, మరికొందరికి ఇవ్వకపోవడంతో గందరగోళంగా మారింది. సచివాలయాలు, రేషన్ డిపోల చుట్టూ తిరగలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్డులు ఎక్కడ ఇస్తారనే సమాచారం కూడా అధికారులు ఇవ్వడంలేదు. – ఉండవల్లి సురేష్, మండపాక

స్మార్ట్ పరేషన్

స్మార్ట్ పరేషన్

స్మార్ట్ పరేషన్