
మట్టి మాఫియా ఆగడాలపై నిరసన
పెనుగొండ : మట్టి మాఫియా ఆగడాలపై శనివారం సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. ఆచంట నియోజకవర్గంలో ఆచంట వేమవరం, ఆంచట శివారు నక్కల కాలువ, గుమ్ములూరు రాయగొప్ప నక్కల కాలువలో మట్టి తవ్వకాలు జరిపిన ప్రాంతాలను సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ మాట్లాడుతూ మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు పెచ్చు పెరిగిపోతున్నాయన్నారు. మట్టి తరలింపు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణలు వెనుక మామూళ్లు కథ ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు, బోదే గట్టు, కాలువ గట్టు మట్టి తీసుకుపోతున్నా అధికారులు కన్నేత్తి చూడలేదన్నారు. జిల్లా మంత్రి అండదండలతోనే మట్టి తవ్వకాలు జరిగాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా 15 అడుగుల లోతు తవ్వేశారన్నారు. పశువులు దిగితే జాడ కనిపించే పరిస్థితి లేకుండా ఉందన్నారు. పూర్తిగా తవ్వేయడం వలన గట్టుకు ప్రాంతంలో ఉన్న అయిదు గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని, వెంటనే చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు పిల్లి ప్రసాద్, మూడే మోజేస్, పి మోహనరావు, ఎస్వీఎన్ శర్మ, తలుపూరి బుల్లాబ్బాయి, సిర్రా నరసింహమూర్తి, కొండేటి సత్యనారాయణ, తోటపల్లి సత్యనారాయణ, గెద్దాడ త్రిమూర్తులు పాల్గొన్నారు.