దాడి కేసులో టీడీపీ నాయకులకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

దాడి కేసులో టీడీపీ నాయకులకు రిమాండ్‌

Sep 20 2023 6:10 AM | Updated on Sep 20 2023 12:44 PM

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యంను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తలారి, జీవీ - Sakshi

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యంను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తలారి, జీవీ

ద్వారకాతిరుమల: మండలంలోని గొల్లగూడెంలో వైఎస్సార్‌సీపీ నేత, అతని అనుచరులపై హత్యాయత్నం చేసిన టీడీపీ నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌ తెలిపిన వివరాలు ప్రకారం... గొల్లగూడెం గ్రామంలో రామాలయం నిర్మాణ విషయంలో రెండేళ్ల క్రితం స్థానిక వైఎస్సార్‌సీపీ నేత ఘంటా వెంకట సుబ్రహ్మణ్యంకు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి వీరవెంకట సత్య వరప్రసాద్‌కు మద్య వివాదం నెలకొంది. అప్పటి నుంచి వారు రెండు వర్గాలుగా ఏర్పడి, గొడవలు పడుతున్నారు.

ఈ నెల 17న రాత్రి వెంకట సుబ్రహ్మణ్యం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్నసమారాధన నిర్వహణ నిమిత్తం పాత రామాలయం వద్ద తన అనుచరులతో కలసి షామియానా పందిరి నిర్మిస్తున్నారు. ఆ సమయంలో సత్య వరప్రసాద్‌ తన అనుచరులు కొమ్మిన సత్యన్నారాయణ, చిలకా సతీష్‌, బొంతు వెంకట ప్రసాద్‌, గంజి సతీష్‌, కొత్తపల్లి హరికృష్ణ, బొంతు మణీంద్రరావులతో ఘటనా స్థలం వద్దకు వచ్చి కర్రలతో సుబ్రహ్మణ్యం, అతని అనుచరులు బొంతు రమేష్‌, ఈలప్రోలు ధర్మరాజు, కొత్తపల్లి గురువిష్ణు, కొత్తపల్లి హేమంత్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి, హత్యచేసేందుకు యత్నించారు.

తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హుటాహుటీన 108 ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏలూరు ఆంధ్రా హాస్పిట్‌లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వారిలో చిలకా సతీష్‌ మినహా మిగిలిన ఆరుగురు టీడీపీ నాయకులను పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేసి, భీమడోలు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండ్‌ విధించారు.

క్షతగాత్రులకు పరామర్శ
ఏలూరు ఆంధ్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యం, ఆయన అనుచరులను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, నియోజకవర్గ పరిశీలకుడు జీవీలు సోమవారం పరామర్శించారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. క్షతగాత్రులు గురువిష్ణు, ధర్మరాజులు మాట్లాడుతూ తాము మొదటి నుంచి వెంకట సుబ్రహ్మణ్యం వెంటే నడుస్తున్నామని, తమను టీడీపీ వారిగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే తలారికి, జీవీకి చెప్పారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు, జిల్లా జేసీఎస్‌ కోఆర్డినేటర్‌ కారుమంచి రమేష్‌, మండల కన్వీనర్‌ ప్రతాపనేని వాసు, జెడ్పీటీసీ శామ్యూల్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement