నల్లబెల్లి : మండలంలో మొరం తవ్వకాలపై మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. అక్రమ ఇటుక బట్టీలు ఏర్పాటు, మొరం తవ్వకాలపై ‘సాక్షి’లో శని, ఆది వారాల్లో ప్రచురితమైన కథనా లకు ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు ఆ శాఖల ఆర్ఐలు శేఖర్, సంపత్, శామంతి శనిగరం శివారులోని ఇటుక బట్టీలను, రామారావు తండా శివారులో మొరం తవ్వకాలు చేపట్టిన ప్రాంతాలను సందర్శించారు. ఇటుక బట్టీ నిర్వహణకు అనుమతులు లేవని గుర్తించారు. విద్యుత్తును, చెరువులోని మట్టిని, కలపను అక్రమంగా వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. రామారావుతండాకు అధికారులు వస్తున్నారనే సమాచారంతో అక్రమార్కులు ప్రొక్లెయినర్లు, టిప్పర్లు తరలించారు. గుట్ట ప్రాంతంలో చేపట్టిన తవ్వకాలను అధికారులు పరిశీలించారు. తవ్వకాలకు అనుమతి లేదని, 1/70 చట్టం ఉల్లంఘించారని నిర్ధారించారు. భూయజమానులు, స్థానికుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడించారు. విచారణలో జీపీఓలు పైడయ్య, రవికుమార్ పాల్గొన్నారు.


