● టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్
నర్సంపేట : పంటల విక్రయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల కాంటా, మిల్లులకు తరలింపు, దిగుమతి, తదితర అన్ని విషయాల్లోనూ రైతులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. హమాలీలు, ట్రాన్స్పోర్టు వాహనాలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. విక్రయంలో ఇబ్బందులు తాళలేక ప్రైవేటు వ్యాపారస్తులను, దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. హమాలీల సంఖ్య పెంచాలని, పంట ఉత్పత్తుల రవాణాకు సరిపడా వాహనాలను సమకూర్చాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, కార్యదర్శి వెలిశాల రాజేశ్, నాయకులు గుంటి రాంచందర్, బోనగాని రవీందర్, గుంటి సంజీవ, సంధాని, సోల్తి సాయికుమార్, రాజు, తదితరులు పాల్గొన్నారు.


